హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రతకు వడగాలులు తోడుకావడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళల్లో జన సంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3, 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
శనివారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయని వెల్లడించింది. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లోని కెరమెరి, దస్తూరాబాద్, అకినపల్లిలో 44.3 డిగ్రీలు, కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 44.2, జగిత్యాల జిల్లా రాయికల్లో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొన్నది. అతితక్కువగా వికారాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీలు నమోదైనట్టు తెలిపింది. వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.