KTR | బీఆర్ఎస్ పాలనలో వైద్యరంగంలో వచ్చిన మార్పులు మామూలు మార్పులు కావని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వైద్యరంగంలో సాధించిన అభివృద్ధి ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 2,850 నుంచి 3515 పెంచాం. హైదరాబాద్కు నలుమూలా టిమ్స్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. అల్వాల్, ఎల్బీనగర్, గచ్చిబౌలి, సనత్నగర్లో నిర్మాణమవుతున్నాయి. రూ.4వేలకోట్లతో 29 మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? 500పైచీలుకు బస్తీ దవాఖానాలు పెట్టింది నిజం కాదా? నిమ్స్ విస్తరణ చేపట్టాం’ అన్నారు.
‘ఈ ప్రభుత్వాన్ని ఏమి అనాల్నో.. నాకైతే అర్థం కాలేదు. ఓ మంత్రి శాసనసభలో లేచి.. జైలు ఊళ్లో ఉండాలి.. హాస్పిటల్ ఊరి చివరలో ఉండాలని అంటరు. అంత గొప్పవాళ్లు ఈ ప్రభుత్వంలో ఉన్నరు. వాళ్లకు అన్ని తెలివితేటలు ఉన్నయ్ వారి విజ్ఞతకే వదిలేస్తా. కానీ మేం మాత్రం వరంగల్లో తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రిని 24 అంతస్తుల్లో నిర్మించాం. ప్రారంభోత్సవానికి రెడీ ఉన్నది. బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి. మళ్లీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇదంతా నిరర్ధకమైన అప్పు అని మాట్లాడారో అది శుద్ధ తప్పు. దాన్ని సవరించుకోవాలి. పద్ధతి మార్చుకోవాలి. మా పనితీరుకు తార్కాణం.. 2014లో మాకు అప్పగించిన నాడు 11వ ర్యాంకులో ఆరోగ్య రంగంలో ఉంటే.. ఇవాళ మూడోర్యాంకుకు చేరుకున్నాం. మాతాశిశు మరణాలు తగ్గినాయి. నీతి ఆయోగ్ ఇండెక్స్లో మూడోస్థానానికి చేరుకుంది. కంటి వెలుగులాంటి మానవీయ ప్రోగ్రామ్ను తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. 3.14కోట్ల మంది ఉచిత శిబిరాల్లో పరీక్షలు చేస్తే.. ఢిల్లీ, కేరళ ప్రభుత్వాలు అభినందించి.. మేం కూడా ఈ పని చేస్తామని చెప్పిన పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి నాయకత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తే మీరే అభాసు పాలవుతారు’ అన్నారు.
‘రాష్ట్రంలో ట్రక్కు డ్రైవర్లుగా భారతదేశమంతా తిరిగేవారు చెబుతుంటరు.. ఎక్కడ చెట్లు ప్రారంభమైతే అక్కడ తెలంగాణ ప్రారంభమైనట్లు అని చెబుతుంటారు. రూ.10,822కోట్లతో మానవ ఇతిహాసంలోనే మూడో అతిపెద్ద ప్రయత్నం హరితహారం. 7.7శాతం అడవులను పెంచాం. ఇంత గ్రీనరీని పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని కూడా నిరర్ధకమైన ఖర్చు అంటారా? ఇది విధ్వంసమా? మరి వాళ్లు విధ్వంసమని అంటున్నరు. గ్రీనరీ పెంచి అద్భుతం చేస్తే.. బ్రహ్మాండంగా వర్షాలు కురిసి.. భూగర్భ జలాలు పెరుగుతుంటే.. నిందించే ప్రయత్నం చేస్తున్నారు. అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉన్నది. దయచేసి గుర్తించండి.. సంస్కారం అంటే అభినందించాలి. లేకపోతే కనీసం నిందించొద్దు. హరిత నిధి ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. హరితహారం కింద 977 అర్బన్ పార్కులు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని అన్నారు.