హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణవ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపరిచిన చోట కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. అన్ని స్ట్రాంగ్ రూముల్లో మూడంచెల భద్రత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్రూమ్స్ పరిసరాలన్నీ సీసీ కెమెరాల ఆధీనంలో ఉన్నాయి.
స్ట్రాంగ్ రూములున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు.. భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. వాటి చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా చర్యలు తీసుకొంటున్నారు. కేంద్ర బలగాలతోపాటు రాష్ట్ర అగ్నిమాపక సిబ్బంది సైతం విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగినా వెంటనే స్పందించేందుకు కొన్నిచోట్ల అగ్నిమాపక యంత్రాలతో మోహరించారు.