హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వక్ఫ్బోర్డు చైర్మన్గా మహ్మద్ మసిఉల్లాఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డు పాలక మండలి గడువు ఫిబ్రవరితో ముగిసిపోవడంతో ప్రభుత్వం ఇటీవలే దానిని పునరుద్ధరించింది. మొత్తంగా 10 మంది సభ్యులతో పాలకమండలిని ఏర్పాటు చేయాల్సి ఉండటంతో ఎంపీ కోటాలో అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ కోటాలో ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే కోటాలో కౌసర్ మొహినుద్దీన్, న్యాయవాదుల కోటాలో జకీర్ హుస్సేన్ జావీద్, ముతావలీల నుంచి అక్బర్ నిజాముద్దీన్ హుస్సేనీ, ఫతే సయ్యద్ బడేషా ఖాద్రీ ఎన్నికయ్యారు. మిగిలిన నలుగురు సభ్యులుగా మహ్మద్ మసిఉల్లాఖాన్, సయ్యద్ నిస్సార్ హుస్సేన్, మాలిక్ మొతేషాన్ఖాన్, షేక్ యాస్మిన్ బాషాను ప్రభుత్వం నామినేట్ చేసింది.
వీరంతా శనివారం సమావేశమై మహ్మద్ మసిఉల్లాఖాన్ను చైర్మన్గా ఎన్నుకొన్నారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరిగింది. అనంతరం మసిఉల్లాఖాన్కు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మసిఉల్లాఖాన్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సహకారంతో వక్ఫ్ బోర్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో బోర్డు సభ్యులతోపాటు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ షేక్, టీఆర్ఎస్ సీనియర్ నేత బద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
9న హజ్ కమిటీ చైర్మన్ ఎన్నిక
రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఎన్నికను సోమవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పటికే హజ్ కమిటీని పునరుద్ధరించింది. అందులోని 14 మంది సభ్యులతోపాటు, ఎక్స్-అఫీషియో సభ్యులైన వక్ఫ్ బోర్డు చైర్మన్, హజ్ కమిటీ సీఈవో 9న సమావేశమై చైర్మన్ను ఎన్నుకోనున్నారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది.