జగిత్యాల టౌన్, ఆగస్టు 31 : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో టీజీఈ జేఏసీ జిల్లా కమిటీ చైర్మన్ మిర్యాల నాగేందర్రెడ్డి, కందుకూరి రవిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటివరకు నెరవేర్చకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, 6 డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహదినం పురస్కరించుకొని ఐడీవోసీ కార్యాయ ఆవరణలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 10న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్రెడ్డి, కో చైర్మన్ ఎండీ వకీల్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.