హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే దశలో ఉన్నది. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఆటంకాలు ఎదురైనా పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. టీఎస్పీఎస్సీతోపాటు ఇతర ఉద్యోగాల భర్తీ కోసం అనేక నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఉద్యోగార్థులైన యువత పోటీ పరీక్షల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో విద్యుత్తు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా.. సమాజంలోని అన్ని వర్గాలు తీవ్ర కష్టనష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఇంతటి కీలక తరుణంలో సమ్మె తగదు. మీరిచ్చిన సమ్మె నోటీసులను ఉససంహరించుకోవాలి’ అంటూ రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్కు ఓ లేఖ రాశారు.
విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు పీఆర్సీ ఫిట్మెంట్ను ప్రకటించాలని, 1999 ఫిబ్రవరి నుంచి ఆగస్టు 2004 వరకు భర్తీ అయిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పెన్షన్, జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 17 నుంచి సమ్మెకు దిగుతున్నట్టు టీఎస్పీఈ జాక్ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసును వెనక్కి తీసుకోవాలని టీఎస్పీఈ జేఏసీ చైర్మన్ను సీఎండీ కోరారు.
పీఆర్సీలో భాగంగా 2014, 2018లో ఇచ్చిన 30, 35 శాతం ఫిట్మెంట్పై యూనియన్లు, అసోసియేషన్లు హర్షం వ్యక్తంచేసిన విషయాన్ని సీఎండీ తన లేఖలో ఉటంకించారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ 2022-23 నాటికి సగటు విద్యుత్తు ఉద్యోగి వేతనం గణనీయంగా పెరిగిన అంశాన్ని కూడా యూనియన్లు శ్లాఘించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
సమ్మె చేయటం, సమ్మెకు దిగాలని ప్రోత్సహించటం ఎంప్లాయీస్ డిసిప్లిన్, అప్పీల్ రెగ్యులేషన్స్కు పూర్తి విరుద్ధమవుతుందని సీఎండీ తెలిపారు. విద్యుత్తు సంస్థలు ప్రజాసేవా సంస్థలని అవి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు. నిరంతరాయ విద్యుత్తును అందించాల్సిన బాధ్యత విద్యుత్తు ఉద్యోగులపై ఉన్నదని,అత్యవసర సేవల చట్టం -1971 పరిధిలోకి విద్యుత్తు కూడా వస్తుందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం విద్యుత్తు సంస్థల్లో సమ్మెలను నిషేధించారని పేర్కొన్నారు.
ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నదని సీఎండీ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసమే.. ఉ ద్యోగ సంఘాలు, జేఏసీతో 1.1.2023, 6.3. 2023, 10.3.2023, 13.3.2023, 29.3. 2023 తేదీల్లో చర్చలు జరిపామని తెలిపారు. విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని.. కార్మికులు, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యాలు సిద్ధంగానే ఉన్నాయని పేర్కొన్నారు. చర్చలు కొనసాగించేందుకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితులను అర్థంచేసుకొని ఈనెల 17 నుంచి చేయతలపెట్టిన సమ్మె నోటీసును వెనక్కి తీసుకోవాలని సీఎండీ కోరారు.
2013-14 నుంచి 2022-23 నాటి వరకు ఉద్యోగులకు ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించడంలో విద్యుత్తు సంస్థలు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 6 శాతం ఫిట్మెంట్ ఇస్తామని విద్యుత్తు సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందుకు విద్యుత్తు సంస్థలపై రూ.526 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని, ఇతర రాష్ర్టాల్లోని విద్యుత్తు ఉద్యోగులు పొందుతున్న జీతభత్యాలతో పోల్చితే.. మన రాష్ట్రంలోని ఉద్యోగుల జీతభత్యాలు అధికంగా ఉన్నాయని సీఎండీ తన లేఖలో పేర్కొన్నారు.