Thank You KCR | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని బ్రిటన్కు చెందిన పలువురు ఎంపీలు ప్రశంసించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, దళితవర్గాల అభ్యున్నతికి చేపడుతున్న దళితబంధు తదితర కార్యక్రమాలను అభినందిస్తూ అంబేదర్ యూకే సంస్థ, ప్రవాస భారతీయ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో లండన్లోని యూకే పార్లమెంటు హాల్లో ‘కేసీఆర్ కృతజ్ఞత సభ’ నిర్వహించారు. దళిత జనోద్ధరణకు కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను బ్రిటన్ సమాజం ప్రశంసించింది.
వివక్షకు గురవుతూ, అట్టడుగున ఉన్న ఎస్సీ కులాల సమున్నత అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అమలుచేస్తున్న పథకాలు, కార్యాచరణ దేశంలో ఓ విప్లవాన్ని సృష్టించిందని పలువురు బ్రిటన్ ప్రముఖులు కొనియాడారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యాచణను ప్రశంసిస్తూ ఇప్పటికే లేఖలు రాసిన పలువురు బ్రిటన్ ఎంపీలు, బ్రిటన్ పౌర సమాజం, ఎన్నారైలు లండన్లో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ సభను నిర్వహించడం సర్వత్రా చర్చకు దారితీసింది. అంబేదర్ యూకే సంస్థ, ప్రవాస భారతీయ సంస్థల సమన్వయకర్త సికా చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంటు సభ్యులు వీరేంద్ర శర్మ, నవేందు మిశ్ర, బేరన్ కుల్దీప్సింగ్ సహోట తదితరులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు.
అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అంబేద్కర్ అని.. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేడు దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని కొనియాడారు. విప్లవాత్మక కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారని బ్రిటన్ ఎంపీలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రవాస సంస్థల ప్రతినిధులతోపాటు దళిత్ యూకే నెట్వర్ డైరెక్టర్ గజాల షేఖ్, అంబేదర్ యూకే సంస్థ ప్రతినిధి సుశాంత్ ఇంద్రజిత్సింగ్, ఎన్నారై బీఆర్యస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి, ఉపాధ్యక్షుడు నవీన్రెడ్డి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టీడీఎఫ్ చైర్మన్ కమల్ ఓరుగంటి, కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, ఉదయ్ ఆరేటి, కన్జర్వేటివ్ నాయకుడు హరి, లోకమాన్య తదితరులు పాల్గొన్నారు.
వినూత్న పథకాలతో తెలంగాణ దేశానికి రోల్మాడల్గా నిలుస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. దళితులు అన్నివిధాలా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. దళితబంధు ద్వారా వేల దళిత కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని నేడు దేశ ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్ ప్రతీ నిర్ణయం చరిత్రాత్మకమని, నేడు కేసీఆర్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు. ఇప్పటికే రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ప్రతీ రాజకీయ పార్టీ దళితులని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని, మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం వారి జీవితాల్లో మా ర్పు తెచ్చిందని కొనియాడారు.