హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ప్రభంజనం కొనసాగుతూనే ఉన్నది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వం.. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నాయకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు బీఆర్ఎస్లోకి పెద్దఎత్తున చేరుతున్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో విదర్భ నుంచి, పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆధ్వర్యంలో ఇతర ప్రాంతాల్లోంచి బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు బీఆర్ఎస్లో చేరారు. అధినేత, సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బాల్క సుమన్ ఆధ్వర్యంలో వార్ధా జిల్లాలోని అర్వి నియోజకవర్గం నుంచి స్వరాజ్ షేత్కరీ సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు జైకుమార్ శంకర్రావు బలెడే, బీజేపీ వార్ధా జిల్లా యువమోర్చా నేత, ఓబీసీ నాయకురాలు హర్షతాల్ జైకుమార్ బలెడే, యాదవరావ్ కేశవరావ్ బంగేతోపాటు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. నాగపూర్ జిల్లా రాంటెక్ నియోజకవర్గం నుంచి రాంటెక్ మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రమేశ్ కార్మోరె, మాజీ కార్పొరేటర్ ఉమేశ్ మహాజన్, శేలేష్ పాఠక్, ప్రయాస్ తవాలే, నాందేడ్ జిల్లా కిన్వట్కి చెందిన సురేశ్ రంగినేని, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేవ్రావ్గోన్వే, గిరిజన నాయకుడు నారాయణరావు సిడాం, హింగోలీ నియోజకవర్గం నుంచి సందీప్ వీ నికతే, గోత్ సర్పంచ్ రాజారామ్ కోవె, దేవిదాస్ మునేశ్వర్ తదితరులు పార్టీలో చేరారు.
కారెక్కిన మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు
బీజేపీ మహారాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, కొల్హాపూర్ లోక్సభ మాజీ జిల్లా కో ఆర్డినేటర్ యువరాజ్ ఆనంద్రావు పాటిల్, చాంగడ్ టౌన్ కౌన్సిలర్, కొల్లాపూర్ మాజీ జడ్పీ సభ్యుడు ఆనంద్ బాలాసాహెబ్ హలందకర్, మాజీ ఎమ్మెల్యే శంకర్ కౌలకర్ కుమారుడు, విద్యావేత్త సుశీల్ కౌలకర్, బీజేపీ కాగల్ తాలూకా అధ్యక్షుడు సందీప్ కురులే, మహారాష్ట్ర రోజ్గార్ పరిషత్ అధ్యక్షుడు, కౌలాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్ విక్రమ్ జరాగ్, కాంగ్రెస్ కొల్హాపూర్ జిల్లా అధ్యక్షురాలు అంజలి జాదవ్, అధికార ప్రతినిధి రవీంద్ర కైరే తదితరులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
తుల్జాపూర్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఎస్టీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్ నవగిరె, మారెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ సర్పంచ్ అశోక్రావు పాటిల్, ఉస్మానాబాద్ జడ్పీటీసీ ప్రకాష్హాన్, శివసేన పార్టీ తుల్జాపూర్ తాలూకా అధ్యక్షుడు కృష్ణ మోరే, వంచిత్ బహుజన ఆఘాడి జిల్లా ఉపాధ్యక్షుడు అంకుశ్ లోకాణ్డే, పుణె జిల్లా నుంచి భీమా కోరేగావ్ – సిధానక్ మహర్ 12వ రాజవంశీకుడు మిలింద్ ఇందమూర్, హ్యూమన్ రైట్స్ ఎగెనెస్ట్ కరప్షన్ సంస్థ అధ్యక్షుడు ఫిరోజ్ ఉమర్ కచ్చిషేక్, గ్రామీణ వశహరి పర్యావరణ్ సేవాభావి సంస్థ అధ్యక్షుడు విజయ్ విఠల్రావు సూర్యవంశీ, పశ్చిమ మహారాష్ట్ర, ఖేడ్ తాలూకా (సతారా) షెత్కరీ సంఘటన అధ్యక్షుడు శంకర్రావు దుల్తారాయ్ గాడ్సే, అఘాడి షెతరీ సంఘటన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంధ్య తాయి వసంత్రావు హింగోలీ, యవత్మల్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నానాసాహెబ్ గడిబోలీ, సతారా లోక్సభ నుంచి డాక్టర్ శంబాజి శివాజీ సంక్పాల్, ఎన్సీపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు, 2019 ఎమ్మెల్యేగా పోటీచేసిన ఘన్శ్యాం అన్నా షేలర్, యువనాయకుడు ప్రశాంత్ షేలార్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు మాణిక్ కదం, శంకరన్న దోండ్గే తదితరులు పాల్గొన్నారు.