చార్మినార్, డిసెంబర్ 29: రాష్ట్ర హైకోర్టును హైదరాబాద్లోని మరో ప్రదేశానికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై శుక్రవారం పలువురు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పలువురు న్యాయవాదులు హైకోర్టు వద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కనీస మౌలిక సదుపాయాలు లేని హైదరాబాద్ శివారు ప్రాంతానికి హైకోర్టును తరలిస్తే తాము ఎలా ప్రాక్టీస్ చేయాలని ప్రశ్నించారు. అన్ని సౌకర్యాలున్న ప్రస్తుత ప్రాంతంలోనే హైకోర్టును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.