మహబూబాబాద్రూరల్, ఫిబ్రవరి 18: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మానుకోటలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం మహబూబాబాద్ మండలం అమనగల్, బలరాంతండా, శనిగపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు షర్మిల పాదయాత్ర కొనసాగింది. అయితే బలరాంతండా వద్ద షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో చాలా అభివృద్ధి చేశారని, ఆయన బిడ్డగా తాను తెలంగాణలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానని చెప్పగా.. బలరాంతండాకు చెందిన గుగులోత్ లకుపతి స్పందించాడు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం దోచుకొని తిన్నాడని, మళ్లీ ఇప్పుడు ఆయన బిడ్డగా యాత్ర పేరుతో తెలంగాణకు వచ్చి ఏమి దోచుకొని పోతావని షర్మిలను ప్రశ్నించాడు.
ఆ సమయంలో పక్కనే ఉన్న పోలీసులు సర్ది చెప్పి అతడిని వెంటనే బయటకు తీసుకెళ్లారు. అలాగే శనిగపురం నుంచి మానుకోట వరకు పాదయాత్ర కొనసాగిన తర్వాత మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో షర్మిల మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. వేలకోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని.. మానుకోట జిల్లాకు ఎస్సారెస్పీ నీళ్లు రావడం లేదని షర్మిల మాట్లాతుండగా సిరికొండ మధుకర్రెడ్డి వెంటనే లేచి జిల్లాకు ఎస్సారెస్పీ నీళ్లు పుష్కలంగా వస్తున్నాయన్నారు. ‘నువ్వు వస్తే చూపిస్తా’నని బదులిచ్చాడు. ఇలావున్నది లేనట్టు షర్మిల తన ప్రసంగంలో అవాస్తవాలు చెప్పడంతో పలువురు అసహనం వ్యక్తంచేశారు. షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.