మహబూబాద్ : మహబూబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ వచ్చింది కనుకనే..మానుకోట జిల్లాగా మారింది. ఇక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నం. రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీని నిర్మించడం చిన్న విషయం కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ సమయంలో మానుకోట సత్తా చాటింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ప్రాంతంపై ప్రత్యేక ప్రేమ అన్నారు. తెలంగాణ రాకుంటే మహబూబాబాద్ జిల్లాయే లేదు. మెడికల్ కాలేజీ లేదు. 65 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే, ఏడేండ్లలో వాటిని 33కు పెంచుకున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు రండి. నాణ్యమైన ఉచిత సేవలు వినియోగించుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రకృతి పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ వికృతి పార్టీలని విమర్శించారు. టీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ. ప్రజల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు.
కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్యే శంకర్ నాయక్, రెడ్యా నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ అంగొతు బిందు, తదితరులు ఉన్నారు.