హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెం ట్ బోర్డును మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రతిపాదించడంపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రజలతో సంప్రదించకుండానే మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో ప్రకటించడం అన్యాయమని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని 1,31,149 మంది పౌరులు సంతకాల ద్వారా అభిప్రాయం వ్యక్తంచేశారని గుర్తుచేశారు.
ప్రజామద్దతును పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సికింద్రాబాద్, లష్కర్గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం ప్రత్యేకమైన చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును కలిగిఉన్నదని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ప్రజలతో సంప్రదించకుండా ఏకపక్షంగా మల్కాజిగిరిలో కలుపడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధమని స్పష్టంచేశారు. ఇప్పటికైనా మల్కాజిరిలో విలీనం చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.