Manjeera Pushkaralu | మెదక్ రూరల్/మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 21 : గరుడగంగ మంజీర నది పుష్కరాలు మెదక్ మండలం పేరూర్ శివారులో శనివారం ప్రారంభంకానున్నాయి. ఈ పుష్కరాలను రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి ప్రారంభిస్తారు. నిత్యం సహస్ర కలశాలతో మంజునాథుడికి అభిషేకం నిర్వహిస్తారు. చిలుకూరు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో సిద్ధ్దలక్ష్మి, గణపతి, పుష్కర దేవతా హవనం 108 హోమ గుండాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మంజీర నదికి 2011లో తొలిసారి పుషరాలు జరిగాయి. అప్పట్లో తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుష్కరాలను ప్రారంభించారు. తాజాగా శనివారం నుంచి 12 రోజులపాటు జరిగే పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. మంజీర నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఈ స్థలంలో ఎకడ మూడు అడుగుల లోతు గుంత తవ్వినా తెల్లటి విభూతి లభిస్తుంది. అప్పట్లో సర్పయాగం జరగ్గా, ఆ సర్పాల దహన ఫలితమే ఈ విభూతి అని స్థలపురాణం చెప్తున్నది. మెదక్ జిల్లా కేంద్రం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో గల పేరూరు శివారులో ఉన్న గరుడగంగ సరస్వతీ ఆలయానికి బస్సులు, ఆటోలు నిరంతరం తిరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు మెదక్ జిల్లా నర్సాపూర్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు సర్వతీర్థాలు మంజీర నదిలో చేరుతాయని, ఆ సమయంలో శక్తిమంతులైన మహాపురుషులు, దేవతలు పక్షి రూపాలు ధరించి మంజీర నదిలో స్నానం చేస్తారని, అప్పుడు నదిలో స్నానం చేసినా, విశేషమైన హోమాలు చేసినా విశేష ఫలం కలుగుతుందని బ్రహ్మపురాణంలో పేర్కొన బడిందని కాశీనాథ్బాబా తెలిపారు. గంగానదికి కర్కాటక రాశిలో గురుడు ఉండగా చేసే స్నానం, సింహరాశిలో గురుడు ఉండగా వేయిసార్లు స్నానం చేస్తే ఏ ఫలమో, కన్యలో గురుడు ఉండగా కృష్ణా నదిలో వందసార్లు స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో.. మేషంలో సూర్యుడు ఉండగా మంజీర నదిలో ఒకసారి స్నానం చేసినా అంత ఫలం వస్తుందని, ఈ కుంభమేళాలో భాగంగా ఈనెల 24, 25, 27, 30, మే 4, 5వ తేదీల్లో మంజీర నదిలో పుణ్యస్నానాలు చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు