హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మణిపూర్ లాంటి కీలక అంశంపై దేశ పౌరులకు విశ్వాసాన్ని కల్పించాల్సిన పార్లమెంట్ మౌనంగా ఉండటం మంచిది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. మణిపూర్ అకృత్యాలపై చర్చించాలని ఉభయసభల్లో వాయిదా తీర్మానానికి పట్టుబడుతున్నా చర్చకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్ అంశంపై సోమవారం సభ ప్రారంభంగానే రాజ్యసభలో కే కేశవరావు, లోక్సభలో నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో చైర్మన్, లోక్సభలో స్పీకర్ ఇందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఉభయసభలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యసభలో 176వ నిబంధన కింద చైర్మన్ జగదీప్ ధన్కర్ స్వల్పకాలిక చర్చకు అనుమతించారు. దీన్ని బీఆర్ఎస్ ఆక్షేపించింది. 267వ నిబంధన కింద మణిపూర్పై దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని కేశవరావు డిమాండ్ చేశారు. లోక్సభలోనూ బీఆర్ఎస్ ఎంపీలతోపాటు విపక్ష ఎంపీ నినాదాలు, నిరసనలతో హోరెత్తించారు. సభ ఆర్డర్లో లేకపోయినా లోక్సభలో సినిమాటోగ్రఫీ-2023 బిల్లును అధికార పక్షం తన సంఖ్యాబలంతో ఆమోదింపజేసుకున్నది. అనంతరం కేశవరావు మాట్లాడుతూ.. మణిపూర్ అంశంపై ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.