తాడ్వాయి, ఫిబ్రవరి14: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క-సారక్క మండమెలిగే పండుగను పూజారులు ఘనంగా నిర్వహించారు. ముందుగా సమ్మక్క పూజా మందిరంలో తల్లి గద్దెను, అమ్మవార్ల పూజా సామగ్రిని పూజారులు సిద్దబోయిన మునీందర్, కృష్ణయ్య శుద్ధి చేశారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారుల కుటుంబాలకు చెందిన ఆడపడుచులు తల్లి గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ముగ్గులతో అలంకరించారు.
ధూపదీప, నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. డోలు వాయిద్యాల నడుమ గ్రామం మధ్యలోని బొడ్రాయి, పోశమ్మ గుళ్లకు చేరుకుని పూజలు చేశారు. కన్నెపల్లి నుంచి సారక్క, మేడారం నుంచి సమ్మక్క పూజారులు రాత్రి 8 గంటల సమయంలో తల్లుల గద్దెలకు చేరుకుంటారు. ఒకరికొకరు సాకను ఇచ్చిపుచ్చుకుని రహస్య పూజలు చేస్తారు. రాత్రంతా గద్దెల ఆవరణలో జాగారాలు చేస్తారు. కాగా.. మంత్రి సీతక్క రహస్య పూజల దగ్గరికి వెళ్తుండగా కొందరు పూజారులు అడ్డుకోవడంతో ఆమె వెనుదిరిగారు.