Manda krishna Madiga | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేస్తున్నాడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగల తరపున మాట్లాడితే.. మాలలు తన సీఎం కుర్చీకి ఎసరు పెడుతారని రేవంత్కు భయం పట్టుకుంది. భట్టి పట్టుబట్టి అనుకున్నది సాధించుకున్నాడు. ఒక వేళ రేవంత్ దిగిపోతే, తాను సీఎం అవ్వాలని కాచుకుని కూర్చున్నడు భట్టి. నాగర్కర్నూల్లో సంపత్కు టికెట్ రాకుండా రేవంతే అడ్డుకుంటున్నాడు అని మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రెడ్డినేమో ముఖ్యమంత్రి.. మాలనేమో డిప్యూటీ సీఎం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి కేబినెట్ హోదాలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి. స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మాలనే. 30 ఏండ్లుగా పార్టీకి సేవలందిస్తున్న సంపత్ కుమార్కు అవకాశాలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో మాకు గాడ్ ఫాదర్లు లేకపోవడంతోనే పదవులు, సీట్లు దక్కడం లేదు. వాళ్లకు గాడ్ ఫాదర్లు ఉన్నారు కాబట్టే అటు పదవులు, ఇటు సీట్లు దక్కుతున్నాయని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కర్ణాటకకు చెందిన మాల. గతంలో జాతీయ అధ్యక్షులుగా పని చేసిన దామోదరం సంజీవయ్య, బీ శంకరానంద్ కూడా మాల కులానికి చెందిన వారే. తెలంగాణలో మాదిగల జనాభా చూడరు. మా నాయకుల సేవలు కూడా పరిగణనలోకి తీసుకోరు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో 85 శాతం మాదిగలు ఉన్నారు. సంపత్ చేత ఊడిగం చేయించుకునేందుకు జాతీయ కార్యదర్శిగా పెట్టుకుంటారు. సొంత జిల్లాలో పోటీ చేస్తానంటే సంపత్కు ప్రాధాన్యత ఇవ్వరు. మాకు సీట్లు, పదవులు ఇప్పించే పలుకుబడి గల నాయకులు మాకు లేరు. కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచి మోసమే జరిగింది.. ఇప్పుడు కూడా మోసమే జరుగుతుందని మందకృష్ణ మండిపడ్డారు.
తెలంగాణలో పరిశీలిస్తే మల్లు అనంతరాములు, జీ వెంకటస్వామి పీసీసీ అధ్యక్షులు అయ్యారు. మల్లు అనంతరాములు ఎంపీగా పని చేశారు. జీ వెంకటస్వామి కూడా ఎంపీ అయి కేంద్ర మంత్రి పదవిలో కొనసాగారు. మల్లు అనంతరాములు తమ్ముళ్లకు ఉన్న విలువ మాదిగ కులానికే లేదు కదా..? ఇది ఎంత అన్యాయం..? జీ వెంకటస్వామి కొడుకులకు ఉన్నంత విలువ మాదిగ కులానికే లేదు కదా..? పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మా జనాభా 70 శాతం ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలోనే ఎస్సీ నియోజకవర్గాలైన చెన్నూరు, బెల్లంపల్లి ఉన్నాయి. బెల్లంపల్లి నుంచి వెంకటస్వామి పెద్ద కుమారుడు వినోద్, చెన్నూరు నుంచి వినోద్ తమ్ముడు వివేక్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అక్కడ వాళ్లు ఇద్దరు అన్నదమ్ముళ్లు, ఇక్కడ వీళ్లు ఇద్దరు అన్నదమ్ముళ్లు పదవుల్లో ఉన్నారు. ఇక గడ్డం వంశీ(వివేక్ కుమారుడు) పెద్దపల్లి ఎంపీ టికెట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంత అన్యాయం. తెలంగాణలో ఉన్న మాదిగలు ఆలోచించుకోవాలి. తెలంగాణలో రెడ్ల రాజ్యం నడుస్తోంది. లేదంటే మాలల రాజ్యం నడుస్తోంది అని మందకృష్ణ పేర్కొన్నారు.