ఆమనగల్లు, మార్చి 10: దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న కుట్రలను ఆపకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం హెచ్చరించారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ వస్పుల జంగయ్యతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ధైర్యంగా ఎండగడుతున్న సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రధాని మోదీ దర్యాప్తు సంస్థల ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు పంపడం కేంద్రం కక్ష సాధింపేనని జగన్నాథం మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సర్కార్ను అస్థిర పరచడానికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అక్రమంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ తరహా సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో బీజేపీకి బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయమని, సీఎం కేసీఆర్ కాబోయే ప్రధాని అని జగన్నాథం ఆకాంక్షించారు.