సెప్టెంబర్ నాటికి డీపీఆర్ సిద్ధం.. ఆ తరువాత టెండర్లు
తెలంగాణలో 370 కి.మీ, ఏపీలో 30 కి.మీ మేర నిర్మాణం
హైదరాబాద్, మే16(నమస్తే తెలంగాణ): నాగపూర్-విజయవాడ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా మంచిర్యాల-విజయవాడ మార్గంలో నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్లో ప్రారంభించే అవకాశం ఉన్నది. మొత్తం హైవే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మహారాష్ట్ర సరిహద్దుల నుంచి మంచిర్యాల వరకు 95 కిలోమీటర్ల మేర పనులు 50 శాతం పూర్తయినట్టు అధికారులు చెప్తున్నారు. మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ మార్గంలో నిర్మాణ పనులకు సంబంధించిన డీపీఆర్ను సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి, టెండర్లు పిలవనున్నారు.
ఆ తర్వాత 2023 జనవరి నాటికి కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తయితే, ఒప్పంద సంస్థ పనులు చేపట్టడానికి మరో నాలుగైదు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన 2023 జూన్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. మంచిర్యాల-విజయవాడ హైవే నిర్మాణానికి దాదాపు 1,500 హెక్టార్ల భూమి అవసరమని అధికారుల అంచనా. మహారాష్ట్ర సరిహద్దుల నుంచి విజయవాడ వరకు తెలంగాణలో 370 కిలోమీటర్ల రహదారి పనులు చేపట్టనున్నారు. ఏపీ పరిధిలో మరో 30 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణ పరిధిలో రూ.12 వేల కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు.