ఖైరతాబాద్, జూన్ 4 : పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమంలో చైర్మన్లు, కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని పలువురు కాంట్రాక్టర్లు, చైర్మన్లు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘మన ఊరు.. మన బడి’ చైర్మన్లు, కాంట్రాక్టర్ల కమిటీ ప్రతినిధి ఏ రామచందర్ మాట్లాడుతూ.. 2023 వరకు తమకు బిల్లులు సక్రమంగా వచ్చాయని, డిసెంబర్లో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటివరకు రూపాయి బిల్లు రాలేదని వాపోయారు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ తిరగడంతో జీవో నం-38 జారీ చేసి రూ.50కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారని, ఇప్పటివరకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు.
‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అప్పులు తెచ్చి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని, రెండున్నరేండ్లుగా బిల్లులు రాక కుటుంబాన్ని పోషించుకోలేక, అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పిల్లలకు ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉన్నదని, ఆడపిల్లల పెండ్లిలు కావడం లేదని వాపోయారు. రూ.300 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణకు వెనుకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో అజ్మీరా రమేశ్, మార్తాల వెంకట్రెడ్డి, రాజు, రమేశ్, రమణారెడ్డి, ఖలీమొద్దీన్, శ్రీనివాస్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.