హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) :కా ర్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా సర్కార్ బడులను రూపుదిద్దాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. శుక్రవారం మంత్రి పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి ‘మన ఊరు-మన బడి’ పనులపై సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల సమూల మార్పునకు చేపట్టిన మొదటి విడత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 26,065 ప్రభుత్వ పాఠశాలలుండగా, మొదటి విడతలో 9,123 బడుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఇందుకోసం రూ.3,4 97 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేరొన్నారు. మొదటి విడత పనుల కింద పాఠశాలల బాగుతో 14,71, 684 (63%) మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు.
పారదర్శకంగా బదిలీలు..
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి సబిత ఆదేశించారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు ప్రకటించే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని లోపాలు లేకుండా, అనుమానాలకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. ఈ విషయంలో కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.