హైదరాబాద్ : మన బస్తీ- మనబడి(Mana Basti-Mana Badi) పనులను వేగవంతంగా చేపట్టి మే నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ లో మన బస్తీ- మన బడి కార్యక్రమం కింద మొదటి విడతలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులపై మంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన జరగాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమం అమలు కోసం రాష్ట్రంలో 26,065 పాఠశాలల్లో అభివృద్ధి పనులకోసం రూ. 7,289 కోట్ల ను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో మొదటి విడతలో 35 శాతంగా 9,123 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
ఇందుకు గాను రూ. 3,497 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు.ఈ నిధులతో పాఠశాలల్లో ప్రహరీగోడ నిర్మాణం (Compound wall), భవనాలకు పెయింటింగ్(Paintings), విద్యుత్ సౌకర్యం(Elecricity), తాగునీటి సరఫరా, టాయిలెట్స్ నిర్మాణం, ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్ బోర్డ్ ఏర్పాటు వంటి పనులను చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలల ను అభివృద్ధి పనులను గుర్తించి రూ. 44 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. వీటిలో వివిధ కారణాలతో 198 పాఠశాలల్లో మాత్రమే పనులను చేపట్టినట్లు వివరించారు.
ఈ పనులను కూడా ప్రభుత్వరంగ సంస్థలైన జీహెచ్ఎంసీ ( GHMC),టీఎస్ ఎంఐడీసీ (TSMIDC), టీఎస్ టీడబ్ల్యూఈడబ్ల్యూఐడీసీ(TWEWIDC), సీఆర్ఐటీసీ (TSCRIC) ల ఆధ్వర్యంలో చేపట్టామని పేర్కొన్నారు. సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, విద్యాశాఖ, అధికారులు పాల్గొన్నారు.