పెద్దవూరలో విజయభాస్కర్రెడ్డి అంత్యక్రియలు పూర్తి
హాజరైన మంత్రులు మహమూద్ అలీ, తలసాని, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి
పెద్దవూర, ఏప్రిల్ 4 : పెద్దవూర సర్పంచ్, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్రెడ్డి అంత్యక్రియలు ఆదివారం పెద్దవూర మండల కేంద్రంలో ముగిశాయి. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొని భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుంటుబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతిమయాత్రలో భాస్కర్రెడ్డి పాడెను మంత్రి జగదీశ్రెడ్డి మోశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, గోనె వివేక్ రావు, దూదిమెట్ల బాలరాజు యాదవ్, గడ్డంపల్లి రవీందర్రెడ్డి, కర్నె బ్రహ్మానందరెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాధ, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవినాయక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విజయభాస్కర్రెడ్డి మృతి తీరని లోటు : మంత్రి జగదీశ్రెడ్డి
విజయభాస్కర్రెడ్డి మృతి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరని లోటని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఉద్యమ కాలం నుంచి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదని తెలిపారు. వయసులో చిన్న వాడైనప్పటికీ రాజకీయంగా పరిణితి చెందిన విజయభాస్కర్రెడ్డికి సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నమోదు చేసుకున్న విజయాల్లో భాగస్వామ్యం ఉందన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా విజయ భాస్కర్ ఎదుర్కొని రాణించారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సర్పంచ్గా గ్రామ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారని, అటువంటి మనిషి మనమధ్య లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.