నల్లగొండ : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం.. హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యానికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో మల్లు స్వరాజ్యం జన్మించారు. మల్లు కుటుంబానికి వందలాది ఎకరాల భూమి ఉంది. వీరిది భూస్వామ్యం కుటుంబం కావడంతో.. 1945- 46లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును స్వరాజ్యం గడగడలాడించారు. 1947- 46లో స్వరాజ్యం ఇంటిపై నైజాం గుండాలు దాడులకు పాల్పడ్డారు. మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.
మల్లు స్వరాజ్యం మహిళ కమాండర్గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యంను పట్టిస్తే రూ. 10 వేలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి మల్లు స్వరాజ్యం ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 -83 వరకు, 1983-84 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. నా గొంతే తుపాకీ తూటా పేరుతో మల్లు స్వరాజ్యం ఆత్మకథ ప్రచురితమైంది.