జడ్చర్ల, జూన్ 30 : మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మక్కకు రికార్డు స్థాయి ధర లభించింది. మంగళవారం అత్యధికంగా క్వింటాకు రూ.2, 431 ధర పలుకడం మార్కెట్ చరిత్రలోనే మొదటిసారి. మక్కజొన్న క్వింటా ధర రూ.2,400 ఉన్న సమయంలో రైతుల నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనలేదు. దీనికితోడు కేంద్రాల్లో కొనుగోలు చేయడంలో ఆలస్యం కావడం.. వర్షాలు కురువడంతో మక్క తడిచిపోవడంతో పలువురు రైతులు నష్టపోయారు.
మిగతా రైతులు అమ్ముకోకుండా నిల్వ ఉంచి ప్రస్తుతం విక్రయిస్తుండటంతో మంచి ధర వస్తున్నది. సీజన్ మొదట్లో క్వింటా ధర రూ.1,600 నుంచి రూ.1,800 వరకు ధరలు పలుకగా.. ప్రస్తుతం అత్యధిక ధరలు లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.