నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13: మక్కలు నింపేందుకు సంచులు లేక.. కొన్నవాటిని తరలించేందుకు లారీలు రాక మక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గన్నీ సంచుల కొరత పేరుతో అధికారులు మక్కలు కొనడం లేదని బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట ఖానాపూర్-తర్లపాడు ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు.
తూకం వేసిన బస్తాలను కూడా లారీల కొరత పేరుతో తరలించడం లేదని, క్వింటాల్కు రూ.50తోపాటు అదనంగా డబ్బులను అధికారులు, సిబ్బంది వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గన్నీ సంచులు, లారీలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నదని నిర్మల్ జిల్లా పెంబి కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు.

వర్షం వస్తే మక్కలు తడిసిపోయి నష్టపోతామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే లారీలను సమకూర్చి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన మక్కలను తరలించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురంలో ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో ఆన్లైన్ వేలిముద్రల సేకరణ నిలిచిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గన్నీ సంచుల కొరత కూడా తీవ్రంగా ఉందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులుగా ఆన్లైన్ సేవలు నిలిచిపోవడంతో విసుగు చెందిన రైతులు ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆన్లైన్ పద్ధతి లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.