హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో తరగతులవారీగా వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు ప్రదర్శించాలని ఆదేశించింది. ఫీజుల ఖరారును ఆధారాలను, పాఠశాల గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో కూడిన తీర్మాన పత్రాలను కూడా సమర్పించాలన్నది. పాఠశాల నోటీసుబోర్డు, వెబ్సైట్తోపాటు పాఠశాల విద్యాశాఖ పోర్టల్లోనూ పొందుపరచాలని ఆదేశించింది. గత విద్యాసంవత్సరం తాలూకు ఆడిట్ నివేదికలు కూడా సమర్పించాలన్నది. ఈ నిబంధనలు పాటించని స్కూళ్లపై కఠిన చర్యలుంటాయని, ఇలాంటి స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని అధికారులకు సూచించింది.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్-2027 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలంగాణ మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్పాషా తెలిపారు. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు అవకాశం ఉన్నదని శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం ఈ నెల 12 వరకు గడువు ఉన్నదని వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగినవారు ఎస్సెస్సీ, డిగ్రీ సర్టిఫికెట్లు, పాస్పోర్టు సైజు ఫొటోతో manuu. gleamappstore.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 16న ప్రవేశ పరీక్ష నిర్వహించి కోచింగ్ అర్హులను ఎంపికచేయనున్నారని పేర్కొన్నారు.