మహబూబ్నగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే కోడ్ ఉల్లంఘించారు. దాదాపు పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా మారింది. రెండ్రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన వెంటనే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతుండటంతో కాలనీవాసులే విస్తుపోతున్నారు.
ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి.. ఉన్నతాధికారులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రెండేండ్లుగా చీకట్లో మగ్గిన బండమీదిపల్లికి హైమాస్ట్ లైట్లు వేయాలని స్థానికులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికార పార్టీ నేతలు నామినేషన్ వేయగానే అప్పటికప్పుడు లైట్లు వేసేందుకు పోల్స్ బిగించడంతో ఓటర్లు ముక్కున వేలేసుకున్నారు. అలాగే రెండు బోర్లను వేసి మోటర్లు సైతం బిగించారు. ఇదంతా మున్సిపల్ అధికారుల అండదండలతో జరగడం గమనార్హం.