Gandhi Sarovar | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెడగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. విగ్రహాల ప్రతిష్ఠ కోసం నిరుపేదలను రోడ్డున పడేయడం అత్యంత అప్రజాస్వామికమని, ఇది గాంధీ సిద్ధాంతాలకే విరుద్ధమని ‘ఎక్స్’ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. మహాత్ముడి విగ్రహం ఏర్పాటుచేసే సాకుతో నివాసితులను ఖాళీ చేయించడం గాంధీ తత్వానికి వ్యతిరేకమైన చర్య అని అభివర్ణించారు.
ఒకవేళ గాంధీ ఇప్పుడు బతికి ఉంటే తన పేరుతో పేదలను ఇబ్బందులు పెట్టవద్దని, ఈ పనులను ఆపమని కచ్చితంగా చెప్పేవారని పేర్కొన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రాజెక్టుల పేరుతో సామాన్యులను ఇక్కట్లకు గురి చేయవద్దని సీఎం రేవంత్రెడ్డికి తుషార్గాంధీ హితవు పలికారు.