దక్షత, దార్శనికత కలిగిన.. సమర్థుడై.. చేయాలన్న తపన ఉన్న నేత పాలకుడైతే ఎంతటి తీవ్రమైన సమస్య అయినా ఎలా పరిష్కారమవుతుందో.. తెలంగాణలో మారిపోయిన వ్యవసాయ ముఖచిత్రాన్ని.. అన్నదాతల కండ్లల్లో ఆనందబాష్పాలే చెప్తాయి.
జనం గోసపట్టని వాడు పాలకుడైతే.. అన్నదాతల కష్టం తెలియనివాడు నాయకుడైతే.. చేయాలన్న మనసే లేనివాడు ఒక రాష్ట్రంలో పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో మహారాష్ట్రలోని
విదర్భ ప్రాంత రైతుల ఉసురు చెప్తుంది.
భారత వ్యవసాయరంగం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలు లేకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నది. నల్ల చట్టాలను తీసుకురావడం, రైతుల ఉద్యమంతో వెనక్కితీసుకోవడం ఇందులో భాగమే. కేంద్రం అనాలోచిత నిర్ణయంతో 750 మందికి పైగా రైతులు నిరసనల్లో అమరులయ్యారు.
2013 నాటి మాట.. దేశ వ్యాప్తంగా వ్యవసాయం కుదేలైన సందర్భం.. ముఖ్యంగా మహారాష్ట్రలోని విదర్భ.. ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో అన్నదాతలు అల్లాడిపోతున్న సమయం. దేశవ్యాప్తంగా 11,744 మంది రైతులు చనిపోతే.. అందులో 3,222 మంది ఈ రెండు ప్రాంతాల్లోనే ఆత్మహత్యలు చేసుకొన్నారు.
విదర్భ ప్రాంతంలోని 11 జిల్లాల్లో 1,022 మంది బలవన్మరణం చెందారు. తెలంగాణలో అంతకుమించి 1,211 మంది ఆత్మహత్య చేసుకొన్నారు.
ఏడాది తరువాత.. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైంది. ఉద్యమానికి సారథ్యం వహించిన నాయకుడు సీఎం అయ్యారు. ఆయన పాలన మొదలై ఎనిమిదేండ్లు గడిచాయి.
2021 సంవత్సరం.. తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయి. కేంద్ర నేర గణాంకాల విభాగం లెక్కల ప్రకారం 352 మంది రైతులు చనిపోయారు. వీరిలోనూ అత్యధి కులు ఇతరత్రా కారణాల వల్ల చనిపోయినవారే.
మరోవైపు విదర్భ ప్రాంతంలో రెండు దశాబ్దాల క్రితం నాటి పరిస్థితే.. 2021లో 1,251 మంది రైతులు బలవన్మరణం పాలయ్యారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ)
ప్రత్యేక రాష్ట్రం కోసం నాడు తెలంగాణ ఉద్యమించిం ది.. విదర్భ ఉద్యమించింది. తెలంగాణ కల సాకారమైంది. విదర్భ ఉమ్మడి మహారాష్ట్రలోనే ఉండిపోయింది. తెలంగాణ వచ్చిన్నాడు ఉన్న కడగండ్లు అన్నీఇన్నీ కావు. ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్రావు బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకొన్న కార్యాచరణ వ్యవసాయం, విద్యుత్తు,వ్యవసాయానికి ప్రధానమైన సాగునీరు. ఇందుకోసం అప్పటి వరకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు కార్యాచరణ.. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల విధానం పునరుద్ధరణ.. మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువుల్లో పూడిక తీయించి నీళ్లు నింపే పక్కా వ్యవస్థ రూపకల్ప న. అన్నింటికీ మించి ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్లలో నిర్మించడం.. సీఎం కేసీఆర్ చేసిన బృహత్కార్యం రైతుల్లో, వారి కుటుంబాల్లో భరోసా కల్పించడం. వ్యవసాయం దండుగ కాదని ధీమానివ్వడం.. పెట్టుబడికోసం రైతుబంధును.. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రైతు బీమాను కల్పించడం.. రుణమాఫీ చేయడం.. అంతే.. తెలంగాణలో రైతుల జీవితాలు ఒక్కసారిగా మారిపోయా యి. తెలంగాణ కోటి ఎకరాల మాగాణమైంది. దేశానికే అన్నపూర్ణగా అవతరించింది. వ్యవసాయరంగంపైన, రైతులపైన పాలకుడికి ఉన్న మక్కువ ఈ రాష్ట్ర కర్షకుల బతుకులను రూపాంతరీకరించింది.
ఎక్కడ ఉన్న విదర్భ అక్కడే!
తెలంగాణకు పూర్తి భిన్నమైన పరిస్థితి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నెలకొన్నది. ముఖ్యం గా పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానిది. విదర్భలో తీరని కడగండ్లు.. ఆగని కన్నీళ్లు. విదర్భ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయింది. 1986 మార్చి 19న సాహెబ్రావ్ కార్పే కుటుంబం తమ నుదుటిపై రూపాయి నాణా లు అతికించుకొని ఆత్మహత్య చేసుకొన్న నాటి గగుర్పొడిచే సన్నివేశాలు ఇవాళ్టికీ మారలేదు. దేశంలో అత్యంత కరువు ప్రాంతం విదర్భ అని తెలిసి కూడా మూడున్నర దశాబ్దాలుగా దాన్ని పట్టించుకోని అసమర్థ నాయకత్వం ఆ రాష్ర్టా న్ని, దేశాన్ని ఏలుతున్నది. డబుల్ ఇంజిన్ అని చెప్పుకొంటుంది. ఈ ఏడాది ఇప్పటికే విదర్భ ప్రాంతంలోని అమరావతిలో 331, యావత్మల్ జిల్లాలో 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో 805 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం గొంతు నులిమేందు కు నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు బలిగొన్న పాలకులకు ఒక ప్రాంతం ఎడారి అవుతుంటే మాత్రం పట్టింపు ఎందు కు ఉంటుంది? మహారాష్ట్రలో రైతులు చనిపోతే రూ.లక్ష పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొంటుంది. ఈసారి అక్కడి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందంటే.. 1251 మంది రైతులు చనిపోతే.. వారిలో 799 మందిని పరిహారానికి అనర్హులుగా ప్రకటించింది. మొన్నటికి మొన్న సెప్టెంబర్ 2-3 తేదీల్లో.. 24 గంటల వ్యవధిలో విదర్భలో ఆరుగురు రైతులు బలవన్మరణం పొందారు. యావత్మల్ జిల్లాలో ఐదుగురు, వార్ధాలో ఒకరు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల వ్యథ చెప్పనలవి కానివిగా ఉన్నాయి.
కరెంటుకు కటకట
విదర్భలో ఏడాది సగటు వర్షపాతం 400-600 మిల్లీమీటర్లు. ఈ ప్రాంతంలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, కాలువలు లేవు. 5 వేల కోట్లతో నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మిస్తామని మూడేండ్ల క్రితం ప్రకటించిన ప్రభుత్వం ఇంకా పనులను మొదలే పెట్టలేదు. తెలంగాణ మాదిరి ఉచిత విద్యు త్తు మాట దేవుడెరుగు.. పైసలకిచ్చే కరెంట్ అయినా సరిగా ఇవ్వరు. వారంలో మూడు రోజులు పగలు.. నాలుగు రోజులు రాత్రి ఇస్తారు. సహకార బ్యాంకుల నుంచి రుణాలిస్తామని ప్రభుత్వం చెప్తున్నా.. సమయానికి అందవు. వడ్డీ వ్యాపారుల నుంచి 16-18 శాతం వడ్డీకి అప్పు తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకొన్నా పంట చేతికందుతుందో తెలియదు. కిందామీదా పడి కాస్త పంట పండిస్తే ఆ పంట నిల్వలకు గోదాములు లేవు. మార్కెట్లోకి తీసుకొస్తే మద్దతుధర రాదు. చివరకు రోడ్ల మీద పంట పారబోసి.. పురుగుమందు నోట్లో పోసుకొని చావాల్సిన పరిస్థితి.
వ్యవసాయం చేసేదెలా?
వ్యవసాయానికి కేవలం 12 గంటలపాటే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. అదీ వారంలో కేవలం మూడు రోజులపాటే పగటిపూట విద్యుత్తును అందిస్తున్నారు. మిగతాది రాత్రిళ్లు ఇస్తున్నారు. ఇలా అయితే, వ్యవసాయాన్ని ఎలా చేసేది?
– గోపాల్, వార్ధా రైతు
వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక..
వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఏటా రూ. లక్ష విలువైన మా పంట చేలను అడవి జంతువులు నాశనం చేస్తున్నాయి. అయినా.. అధికారులు తగిన చర్యలు తీసుకోవట్లేదు.
– తుషార్, అమరావతి రైతు
కేంద్రానిదే.. ఈ పాపం
విదర్భ ప్రాంతం వెనుకబడటానికి కారణం మోదీ సర్కారే. ఈ ప్రాంతంపై మహారాష్ట్ర సర్కారుతోపాటు కేంద్రప్రభుత్వం తీవ్ర వివక్షను చూపిస్తున్నది. సాగు ఉత్పత్తులను నగరాలకు తరలించడానికి ఈ ప్రాంతంలో రోడ్డు, రైలు వంటి తగినన్ని రవాణా సదుపాయాలు కూడా లేవు. ఈ ప్రాంతం కోసం కేటాయించిన నిధులను కూడా స్థానిక నేతలు, అధికారులు వినియోగించట్లేదు.
– ప్రముఖ ఆర్థిక వేత్త ప్రదీప్ ఆప్టే
దూరదృష్టితో సమస్య పరిష్కారం
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన కేవలం ఎనిమిదేండ్లలో తపనతో.. దూరదృష్టితో కార్యాచరణ చేపట్టి.. గడ్డమీదకు నీళ్లు రావన్న నోళ్లు ఆశ్చర్యపోయేలా వ్యవసాయం తెలంగాణలో పండుగలా మారింది. తెలంగాణలో అనతికాలంలో సాధ్యమైన ఈ మార్పు.. మూడున్నర దశాబ్దాలైనా విదర్భలో ఎందుకు రాలేకపోయింది? చేయాలన్న మనసున్న పాలకులు లేకపోవ డం.. రాజకీయ ప్రయోజనాలు, అధికార యా వ తప్ప కర్షకులు, సామాన్యుల గోడు పట్టని నాయకుడు అధికారం చెలాయించడం..