గుజరాత్.. గుజరాత్ అన్నారు. మగర్ ఓ గుజర్ గయా.. తెలంగాణ సబ్సే అచ్చా తరీఖా సే ఆగేబడీ. దేశానికి తెలంగాణ మాడల్ కావాలి. మోదీ, అమిత్షా ఇద్దరూ కలిసి అన్ని రాష్ర్టాలను ఆగం చేస్తున్నరు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ.. మోదీని గట్టిగా ఎదుర్కొన్నది లేదు. ఒక్క కేసీఆరే గట్టిగా నిలబడి కొట్లాడుతున్నడు. కేసీఆర్ ఫైటర్. తప్పకుండా విజయం సాధిస్తాడు. అందరినీ ఏకం చేయగల నాయకుడు కేసీఆర్. మేము వచ్చి కేసీఆర్ను కలుస్తాం. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్నగర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ (శివసేన) కునాల్ రాథోడ్ హృదయ స్పందన ఇది.
నేను చాలా ఏండ్లుగా రాజకీయాల్లోనే ఉన్నా. మూడుసార్లు ఇండిపెండెంట్గా సిరొంచ తాలుకా మద్దికుంట గ్రామ సర్పంచ్గా పనిచేసిన. ఎంతోమంది నాయకులను చూసిన. కానీ మా దగ్గర అంత అభివృద్ధి లేదు. మీ తెలంగాణల చాలా బాగా అభివృద్ధి జరిగింది. అందుకే కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి కచ్చితంగా రావాలి. అప్పుడే మంచి మార్పు వస్తది. మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా మద్దికుంట గ్రామ మాజీ సర్పంచ్ రాయిల పాపయ్య అంటున్న మాట ఇది..
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తెలంగాణ సరిహద్దుల్లోనే కాదు.. తెలంగాణ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఇది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు రోజూ నెరిపే ఏ స్థానిక నాయకుడిని కదిపినా.. తెలంగాణ గురించి.. కేసీఆర్ గురించిన చర్చే కొనసాగుతున్నది. దేశంలో ఏ ముఖ్యమంత్రీ, ఏ జాతీయ పార్టీ నేతా చేయలేని సాహసం కేసీఆర్ చేస్తున్నారని వారంతా నమ్ముతున్నారు.
తెలంగాణను సాధించిన స్ఫూర్తితో దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా కేసీఆర్కే ఉన్నదని అచంచల విశ్వాసం ప్రకటిస్తున్నారు. మోదీ ప్రధానే కానీ.. ఇప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రిలాగనే వ్యవహరిస్తడని.. కేసీఆర్ ముఖ్యమంత్రే, కానీ జాతీయనేత లెక్క కనబడ్తడని అక్కడి నాయకులు చెప్తున్నారు.
ఒకవైపు- నల్లని డాంబర్ రోడ్డు. ఎక్కడా గతుకులూ అతుకులూ లేకుండా సాఫ్గా సాగిపోయే రహదారి.
… అది తెలంగాణ ప్రగతి బాట
మరోవైపు- గుంతలమయమై కంకరతేలిన దారి. తారు అక్కడక్కడా తారాడుతూ.. ఇదీ రోడ్డే అని సాక్ష్యం చెబుతున్నట్టు.
… ఇది మహారాష్ట్ర రహదారి
సరిహద్దు కేవలం భౌగోళిక గీతనే కాదు. ఆ ప్రాంత తలరాత కూడా. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దుల్లో రెండు రాష్ర్టాల పాలనకూ, ప్రగతికీ తేడాను పట్టిచూపించే దృశ్యమిది.
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి డిచ్పల్లి, నిజామాబాద్ మీదుగా బాసర.. ఎడతెరపిలేని వర్షం. రోడ్ల మీద పొంగిపొర్లుతున్న నీరు. ఎటు చూసినా పచ్చటి పంటచేలు. రోడ్డుకిరువైపులా ఆకుపచ్చని పందిళ్లేసినట్టు హరితహారం మొక్కలు. వాటి రక్షణకు ఉంచిన ట్రీగార్డులు. మధ్యమధ్యన వలలతో చేపల వేట. భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగుతూ రోడ్డు మీదికి ప్రవహిస్తున్న నీరు.. ఆ నీటిలో వచ్చే చేపలను కర్రలు పట్టుకొని కొట్టే కనువిందు దృశ్యాలు. వీటిని దాటుకొని నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బాసర. అక్కడ చదువుల తల్లి సరస్వతి నెలవైన గోదావరి తీరం. దాటుకుని ముందుకెళ్తే ముథోల్ మండలం బిద్రెల్లి. ఊరి పొలిమేరల్లోనే.. ‘మహారాష్ట్ర – ఆప్కో హార్థిక్ స్వాగత్’ అన్న బోర్డు పలకరించింది. దానిపక్కనే ధర్మాబాద్ – నాందేడ్-భోకర్-కిన్వట్ సైన్బోర్డు. రెండురోజుల పర్యటన ధర్మాబాద్ నుంచి బయల్దేరి బెల్గురి, కోరేగావ్, పేతంబ్రి, సొమ్తాన, భోకర్.. అక్కడినుంచి కిన్వట్ రూట్లో.. సింగల్వాడి, వడ్గాం, సొనారి, సర్సాం, హిమాయత్నగర్, ఇస్లాపూర్, సావర్గాంవ్, చంద్రాపూర్, సవారి, కిన్వట్, దూద్గాఁవ్, చిక్ల్లీబుదూర్, దేవర్గాఁవ్, ఇంజ్గాఁవ్ మీదుగా ఘన్పూర్ నుంచి మళ్లీ ఆదిలాబాద్ జిల్లా బోథ్ ద్వారా తెలంగాణలోకి ప్రవేశం. ఈ క్షేత్రపర్యటనలో భాగంగా తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న మరాఠ్వాడా ప్రాంత జిల్లాల స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు.. గ్రామాల్లో రైతులు, వ్యవసాయకూలీలు, గొర్రెల కాపరులు, చిరు వ్యాపారులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు..అనేక వర్గాలతో నమస్తే తెలంగాణ బృందం ముచ్చటించింది.
తెలంగాణ పథకాలపై క్రేజ్
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మరాఠ్వాడాలో విపరీతమైన క్రేజ్ ఉన్నది. రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోనే కాదు సరిహద్దుకు దాదాపు 161 కి.మీ. లోపలి దాకా (నాందేడ్ జిల్లా ధర్మాబాద్, భోకర్, హిమాయత్నగర్, పొటా, కిన్వట్ దాకా) స్థానిక నేతల్లో ఆసక్తి సుస్పష్టంగా కనిపించింది. కిన్వట్లోనూ తెలంగాణలో అమలవుతున్న ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా పథకాలపై విస్తృతమైన క్రేజ్ ఉన్నది. వీటిపై అక్కడి నాయకులతో ‘నమస్తే’ బృందం వారి అభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేసింది. దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తామని ఇటీవల కేసీఆర్ చేసిన ప్రకటనపైనా గడ్చిరోలి ప్రాంత రైతు తోకలవార్ సంపత్ ఎంతో ఆసక్తి కనపరిచారు. తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా చర్చించే మేధావులు, రాజకీయ నాయకులు.. విద్యావంతులూ మరాఠ్వాడా ప్రాంతంలో కనిపించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వస్తే దేశమంతా తెలంగాణ మాడల్ అమలు అవుతుందని అరుడా సర్పంచ్ రంగు బాపు ఆకాంక్షించారు. ఆ సంక్షేమ పథకాలు తమకూ దక్కుతాయని ఎంతో ఆశగా మాట్లాడారు.
మోదీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్కే ఉంది..
దేశంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న బీజేపీని, మోదీని బలంగా ఎదుర్కొనే శక్తి కేసీఆర్లోనే ఉన్నదని మధ్య మరాఠ్వాడా ప్రాంతంలో బోలేగావ్ పంచాయతీ నేత విశ్వనాథ్ బలంగా విశ్వసించాడు. సఖ్యతగా సహజీవనం చేస్తున్న ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే బీజేపీ విధానాలు, రైతులు, పేదలపై భారం మోపుతున్న మోదీ చర్యలపై ఆ ప్రాంతమంతా ముక్తకంఠంతో నిరసిస్తున్నది. అదే సమయంలో ఇటీవల సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో లేవనెత్తిన అంశాలపై గ్రామీణ, పట్టణం తేడా లేకుండా ఆసక్తిగా చర్చించుకొన్నారు. అలాగే బీజేపీయేతర పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల కన్నా కేసీఆర్లో బీజేపీని ఎదుర్కొనే ధైర్యం ఎక్కువగా కనిపిస్తున్నదని షేక్ సద్దాం అంటున్నారు.
కేసీఆర్ ‘జాతీయ’ కదలికలపై నిశిత పరిశీలన
సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాలపై చేస్తున్న ప్రకటనలు.. మోదీ, బీజేపీ పాలనపై చేస్తున్న సునిశిత విమర్శలను మధ్య మరాఠా ప్రాంతంలో గ్రామీణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న సర్పంచ్లు, వార్డు సభ్యులు తమ దగ్గర ఇలాంటి పథకాలు అమలు చేయలేకపోతున్నామనే బాధ వ్యక్తంచేస్తున్నారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాదు.. పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయాల్లోనూ అది స్పష్టంగానే వ్యక్తమవుతున్నది. ధర్మాబాద్ మొదలుకొని కిన్వట్ వరకు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి నెలకొన్నది. తెలంగాణను సాధించిన నాయకుడిగా, స్వల్పకాలంలోనే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్న పాలకుడిగా, దేశ పరిస్థితులను మార్చగలిగే విజన్ ఉన్న దార్శనికుడిగా విద్యావంతులు చూస్తున్నట్టు పలువురి మాటల్లో స్పష్టమవుతున్నది. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను, ఎన్సీపీ నేత, మాజీ కేంద్రమంత్రి శరద్పవార్ను కలవటం మొదలుకొని ఇటీవలి కాలంలో దేశంలో పలు రాష్ర్టాల్లో చేసిన పర్యటనలపై స్థానిక నాయకత్వం ఆసక్తిని కనబర్చుతున్నది.
బంగారు భారత్.. కేసీఆర్కే ఆ తాకత్
కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే మేమంతా స్వాగతిస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులు, పేదోళ్లు, విద్యార్థులు, మహిళలు, ముసలోళ్లు ఇట్లా అందరికీ కేసీఆర్ మంచి పథకాలు పెట్టిండు. మా మహారాష్ట్రలోనే కాదు, మిగతా ఏ రాష్ట్రంల కూడా మేం ఇన్ని మంచి పథకాలు చూడలేదు. అందుకే కేసీఆర్ అంటే మాకెంతో అభిమానం. ఆయన లాంటి ఆలోచన ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తానంటే మా లాంటి వాళ్లం ఎంతో సంతోషిస్తాం. మేం అందరం మద్దతిచ్చి ఆయన వెనుకే నడుస్తాం.
– రమేశ్, సర్పంచ్, ఆసరెల్లి (సిరొంచ తాలూకా)
కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలి
దేశం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నది. మత పిచ్చితో కేంద్రంలో పాలన జరుగుతున్నది. దేశమంతా సుభిక్షంగా ఉండాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలి.. మత సామరస్యం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. మా పక్కనే ఉన్న తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మేము చూస్తున్నాం. తెలంగాణలో మాదిరిగా ఇక్కడ గ్రామ పంచాయతీలకు నిధులు లేవు. పల్లె ప్రగతి పనులు జరగడంలేదు. పారిశుద్ధ్యం నిర్వహణ లేకపోవడంతో గ్రామాల్లో రోగాలతో ప్రజలు కష్టాలు పడుతున్నరు. మా ప్రజలంతా కేసీఆర్కు జై కొడుతున్నారు. తెలంగాణ గ్రామాల తీరు మా గ్రామాలు కూడా ఉండాలంటే దేశానికి కేసీఆర్ ప్రధాని కావాలి.. అప్పుడే దేశంలోని ప్రజలు సంతోషంతో ఉంటారు.
– షేక్ సద్దాం, సర్పంచ్ ఎస్గీ పంచాయతీ, నాందేడ్, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ చౌరస్తాలో రహదారి దుస్థితి
కేసీఆర్ ఢిల్లీలో ఉంటే దేశానికి మేలు
కేసీఆర్ లాంటి నాయకుడు ఢిల్లీలో ఉండి పాలన చేస్తే దేశానికి మేలు జరుగుతుంది. తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. బోథ్ (ఆదిలాబాద్ జిల్లాలో మండల కేంద్రం) హమారేకు బహుత్ నజ్దీక్ హై..ఉదర్సే ఇదర్.. ఇదర్ సే ఉదర్ లోగ్ ఆతే జాతే హై.. తెలంగాణమే బిజీలీ (కరెంట్), షాదీముబారక్, లంగ్డే వాలేకో (వృద్ధులు) పింఛన్ సోబ్ అచ్ఛా హై. ఇస్ తరహా స్కీమ్స్ దేశ్మే హోనా చాహిహే. కేసీఆర్ దేశ్కీ రాజ్నీతీమే ఆగే బడేతో ఆమ్ జనతా కో అచ్చా ఫాయిదా మిల్తీ హై.. దేశ్మే కోన్ తెలంగాణ స్కీమ్స్కో నహీ చాహతే.
– పండిత్ గైక్వాడ్, పోలీస్ పటేల్, ఇంజేగావ్, కిణ్వట్, మహారాష్ట్ర
రైతుల గురించి ఆలోచించే కేసీఆర్ నాయకత్వం కావాలి
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో చేస్తున్నరు. ఉచితంగా నీళ్లు, కరెంటు, పంటలకు పెట్టుబడి.. ఇట్ల మా మహారాష్ట్రలోనే కాదు దేశంలో ఎక్కడా లేదు. మా మహారాష్ట్ర ప్రభుత్వం కనీసం కరెంటు సరిగా ఇవ్వడం లేదు. నీళ్లు లేవు. ఏ పంట వేయాలన్నా రైతులకు దుఃఖం తప్పడం లేదు. మా దగ్గరి రైతులు వ్యవసాయం వదిలి తెలంగాణకు కూలీలుగా పోతున్నరు. కేసీఆర్ లాగా రైతుల కోసం, పేదోళ్ల కోసం పనిచేసే నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉన్నది.
– తోకలవార్ సంపత్ కుమార్, కౌన్సిలర్, సిరొంచ, గడ్చిరోలి జిల్లా
కేసీఆర్ లాంటి నేత దేశానికి అవసరం
కేసీఆర్ లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడు దేశానికి కావాలి. ఆయన సత్తా ఏందో ఇప్పటికే తెలంగాణలో చూపించారు. రైతులు, ముసలివాళ్లు, పేదోళ్లు, మహిళలు, పిల్లల చదువు, అభివృద్ధి అన్ని పనుల్లో ఆయన మంచిగ చేసి చూపించారు. నేను చాలా ఏండ్లుగా రాజకీయాల్లోనే ఉన్నా. మూడుసార్లు ఇండిపెండెంట్గా సిరొంచ తాలుకా మద్దికుంట గ్రామ సర్పంచ్గా పనిచేసిన. ఎంతోమంది నాయకులను చూశా. కానీ మా దగ్గర అంత అభివృద్ధి లేదు. మీ తెలంగాణలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. అందుకే కేసీఆర్ లాంటి నాయకుడు కచ్చితంగా దేశ రాజకీయంలోకి రావాలి. అప్పుడే మంచి మార్పు వస్తది.
– రాయిల పాపయ్య, మాజీ సర్పంచ్, మద్దికుంట గ్రామం, సిరొంచ తాలూకా..
కేసీఆర్ దేశ్ కీ నేత కావాలి
మా పక్కన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూస్తున్న మా ప్రజలు కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలంటున్నారు. సరిహద్దులో ఉన్న మా గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని మేము ఐదేండ్లుగా కోరుతున్నాం. తెలంగాణ మాదిరిగా ఇక్కడ వ్యవసాయానికి ఫ్రీగా కరెం ట్ ఇవ్వడంలేదు. రైతుబంధు, రైతుబీమా పథకాలు లేవు.. అందుకే మా రాష్ట్రంలోని రైతు నాయకులంతా కేసీఆర్ను కలిసి జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆ హ్వానించారు. కల్యాణలక్ష్మి, షాదీ ము బారక్ పథకాలు ఎంతో బాగున్నాయి. మాకు సరిహద్దులోని తెలంగాణలోని గ్రామాల్లో అనేక మంది బంధువులు ఉన్నారు. దేశమంతటా రైతులు, పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ దేశ్ కీ నేత కావాలి.. ఉద్యమం నడిపి తెలంగాణను సాధించిన కేసీఆర్ సార్తో దేశంలో గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వస్తుంది. అందుకే మేమంతా కేసీఆర్కు జై కొడుతున్నాం.
– బోధన్పాడ్ విశ్వనాథ్, సర్పంచ్, బోలేగావ్ పంచాయతీ, బిలోలి తాలూకా, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర
పేదలకు మంచి చేసే కేసీఆర్ కావాలి
తెలంగాణలో ఎన్నో మంచి సంక్షేమ పథకాలు తెచ్చిండు సీఎం కేసీఆర్ సార్. ముఖ్యంగా రైతుల కోసం రైతుబంధు, ఫ్రీ కరెంటు, రైతుబీమా.. ఇట్లా గతంలో రైతుల గురించి చేసిన నాయకుడిని నేను చూడలేదు. మన దేశంలో రైతులందరికీ ఫ్రీగా కరెంటు ఇస్తా అన్నడు. ఇప్పటికే తెలంగాణల ఇచ్చి చూపించిండు కాబట్టి అందరిలో కూడా భరోసా ఉన్నది. పేదలు, రైతుల గురించి ఆలోచించే కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉంటేనే దేశానికి మంచిది. మేం కూడా కోరుకుంటున్నం. ఆయన జాతీయస్థాయిలోకి వస్తేనే తెలంగాణ మాదిరిగా మా మహారాష్ట్రలో రైతులకు, ప్రజలకు కూడా మేలు చేస్తరు.
– రంగు బాపు, ఆరుడా సర్పంచ్, సిరొంచ తాలూకా, గడ్చిరోలి జిల్లా
దేశానికి తెలంగాణ మాడల్ కావాలి
ఆఠ్ సాల్ పహెలే తెలంగాణ ఆందోళన్కీ అడ్డా థీ.. మగర్ అభీ వికాస్ కీ నయా రాజ్య్ హై (ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణ ఆందోళనలకు అడ్డాగా ఉండింది.. కానీ ఇప్పుడు అభివృద్ధికి చిరునామాగా మారింది). మాకు తెలంగాణ 60-65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన తరువాత అక్కడ జరుగుతున్న అభివృద్ధిని మేం చూస్తున్నాం. విశాలమైన రోడ్లు, రోడ్లకు ఇరువైపులా హరియాలీ (హరితహారం మొక్కలు) కనువిందు చేస్తున్నాయి. రైతుబంధుతో రైతులు ఖుషీగా ఉన్నారు. షాదీముబారక్, అందరికీ పింఛన్లు. మొన్ననే దేశానికి ఉచిత కరెంట్ ఇస్తానని కేసీఆర్ చెప్పిన విషయం ఇక్కడి (మహారాష్ట్ర) రైతుల్లో కొత్త ఆశలు కల్పించింది. గుజరాత్.. గుజరాత్ అన్నారు. మగర్ ఓ గుజర్ గయా.. తెలంగాణ సబ్సే అచ్చా తరీఖా సే ఆగేబడీ. దేశానికి తెలంగాణ మాడల్ కావాలి. మోదీ అమిత్షా ఇద్దరూ కలిసి అన్ని రాష్ర్టాలను ఆగం చేస్తున్నరు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొడుతూ ప్రజలతో ఆటలాడుతున్నరు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ.. మోదీని గట్టిగా ఎదుర్కొన్నది లేదు. ఒక్క కేసీఆరే గట్టిగా నిలబడి కొట్లాడుతున్నడు. కేసీఆర్ ఫైటర్. తప్పకుండా విజయం సాధిస్తారు. అందరినీ ఏకం చేయగల నాయకుడు కేసీఆర్. మేము వచ్చి కేసీఆర్ను కలుస్తాం’
– కునాల్ రాథోర్, హిమాయత్నగర్ పట్టణ మాజీ చైర్మన్
(శివసేన పార్టీ), నాందేడ్ జిల్లా