‘కేసీఆర్ మీకెలా తెలుసు?’
“తెలంగాణ కేసీఆర్ మాకెందుకు తెలియదు. రాష్ట్రం కోసం ఫైట్ చేసిండు. కొత్త రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నడు’ ఇదీ మహారాష్ట్రలోని ధర్మాబాద్లో వెంకటేశ్ సల్లావాడ్ అనే విద్యార్థి మాట.
‘ముఖ్య్మంత్రి కేసీఆర్జీతో రఫ్తార్మే హై.. బీహార్ జాకే హమారే నితీశ్జీసే మిలా’ అని సొమ్తానలో రోడ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న బీహార్వాసి రాంసురేశ్ యశ్పాల్ మనోగతం.
తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్రలో సామాన్య ప్రజల మనోగతం ఇది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని పలుకరించినా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. దేశంలో సుస్థిర పరిపాలన.. సుపరిపాలన.. సంక్షేమం కావాలంటే కేసీఆర్ వంటి దార్శనికుడైన నాయకుడు రావాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. నమస్తే తెలంగాణ బృందం ఇటీవల తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర గ్రామాల్లో పర్యటించినప్పుడు తెలంగాణ పరిపాలనపై.. పథకాలపై.. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎంతో ఆసక్తిని.. ఆ పథకాల ఫలాలు తమకూ అందాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర కిన్వట్-ఇంజ్గావ్కు మధ్య ఉన్న ఓ గ్రామం చిక్లీబుదూర్. రోడ్డును ఆనుకొని వరుసగా ఏడు రూముల బడి. 5వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదివే మాధ్యమిక్ విద్యాలయ్ అది. 250 మంది విద్యార్థులున్నారు. 14 మంది ఉపాధ్యాయులకుగాను 9 మందే పనిచేస్తున్నారు. ఇటీవల ఐదుగురు బదిలీపై వెళ్లారు. మధ్యాహ్న భోజన వసతి ఉన్నది. స్కూల్లోకి పోవాలంటే కింద బురద.. గుంతలు.. దాటుకొని కష్టంగా వెళ్లాలి. చుట్టూ కాంపౌండ్వాల్ లేకపోయినా.. ముందు విరిగిపోయిన గేట్ దిమ్మలున్నాయి. ఉపాధ్యాయులను కదిలిస్తే ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. గుజరాత్ అహ్మద్నగర్కు చెందిన వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన 18 సంవత్సరాల సర్వీసు అంతా మరాఠ్వాడా ప్రాంతంలోనే గడిచిందని ఆయన చెప్పారు. మోదీ పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ జాతీయస్థాయి నేతగా అగుపిస్తరు. మాట్లాడిన ప్రతీసారి జాతీయవాదంతో మాట్లాడుతరు. పంజాబ్ రైతులకు, అమరజవాన్లకు, బీహార్ కూలీలకు ఆయన సాయం చేయడమే అందుకు ఉదాహరణ. కానీ మోదీ అట్లా కాదు. ప్రధానిగా ఉన్నా.. గుజరాత్ ముఖ్యమంత్రిలానే ప్రవర్తిస్తున్నరు..’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ సాహసి
‘మోదీ అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలి. అందరినీ కేసీఆర్ కన్వీన్స్ చేయగలగాలి. ఒక్కో రాష్ట్ర నాయకుడికి ఒక్కో ఎజెండా ఉంది. అయితే మోదీని వ్యతిరేకించటమే కాకుండా.. ధైర్యంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్న నాయకుడు కేసీఆర్ మాత్రమే. కేజ్రీవాల్, నితీశ్కుమార్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ లాంటి వాళ్లనూ ఆయన కలుపుకొని పోవాలి. మోదీని ఎదుర్కొవాలంటే వ్యూహాత్మకంగా ముందుకు సాగితేనే సక్సెస్’ అని అసిస్టెంట్ టీచర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ, బీజేపీ ఖూనీ చేస్తున్నదని.. అనేక రాష్ర్టాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చటం దారుణమని ఆ టీచర్ ఆవేదన వ్యక్తంచేశారు.
బట్టలు మార్చుడే తప్ప బతుకులు మార్చలే..
మోదీ దేశంలో అన్నింటినీ అమ్మేస్తున్నడు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, రైల్వేలు, పోర్టులు అన్నిటినీ అమ్మేస్తున్నడు. ఉద్యోగాల్లేక దేశ యువత ఆందోళనలో ఉన్నది. అధికారంలోకి వచ్చేముందు ఉపాధి కల్పనకు నాదీ బాధ్యత అని చెప్పిన మోదీజీ అసలు ఉపాధే లేకుండా చేసిండు. ఉపాధే ఉంటే పీజీ చేసి బీహార్ నుంచి ఇక్కడికి (సొమ్తాన) వచ్చి నేనెందుకు పనిజేస్త? మోదీ ఎవరికీ ఏమీ చేయలేదు. బట్టలు మార్చుడు తప్ప ఏ ఒక్కరి బతుకును మార్చలేదు.
– రాంసురేశ్ యశ్పాల్, రోడ్వర్క్ సూపర్వైజర్, సొమ్తాన (భోకర్)
కింగ్ కాకపోయినా.. కింగ్ మేకర్ పక్కా
తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా బాగా పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు బాగున్నాయి. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు మంచిగున్నాయి. నిజామాబాద్ జిల్లా మాకు సరిహద్దుల్లోనే ఉన్నది. అక్కడ ఏం అమలవుతున్నవో చూస్తున్నం. తెలంగాణ మాడల్ దేశవ్యాప్తంగా అమలు కావాలని ఎవరు కోరుకోరు? దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. మోదీని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి. ఆ ఏకం చేసే ఆలోచన, ఆచరణ కేసీఆర్కే సాధ్యం. ఇప్పటికిప్పుడు దేశ రాజకీయాలను ఆయన మార్చకపోవవచ్చు. కానీ, భవిష్యత్లో అవకాశముంది. ఇప్పుడు కింగ్ కాకపోవచ్చు.. కానీ కింగ్మేకర్ మాత్రం పక్కా.
– వెంకటేశ్ సల్లావాడ్, ధర్మాబాద్
పత్లా ఆద్మీహై మగర్ ఉన్కో షాందార్ దమ్ హై
మోదీ చాలా దుర్మార్గంగా పాలిస్తున్నడు. నవ్వుతూ గొంతు కోస్తున్నడు. మోదీని ఇప్పటివరకు ధైర్యంగా ప్రశ్నించే నాయకుడు కనిపించలేదు. కేసీఆర్ పత్లా ఆద్మీ హై మగర్ ఉన్కో షాందార్ దమ్ హై (కేసీఆర్ బక్కపలచని మనిషే అయినా దమ్మున్నోడు). మోదీని నేరుగా అడుగుతున్నడు. ఇట్లా అడిగేవాళ్లు ఒక్క పక్కకు రావాలె. వాళ్లకు కేసీఆర్ లీడర్ కావాలె. దేశం బాగుపడాలంటే నాయకుడికి బలమైన విజన్ ఉండాలె. అది కేసీఆర్లో ఉన్నదని తెలంగాణను చూస్తే తెలిసిపోతది.
–హేమంత్ షిండే, చిక్లీబుదూర్ (కిన్వట్)
ధరల భయంతోనే పోతామేమో..
పన్నులు, ధరలు రోజూ పెరుగుడే. ఇంతగనం పెంచితే బతుకుడు కష్టం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతూనే పోతున్నాయి. వ్యాపారాలు చేసుకునేవాళ్లు, ఉద్యోగులు పెరిగే ధరలను కొంతవరకు తట్టుకుంటారు. కానీ సామాన్యజనం పెరిగే ధరల భయంతోనే సచ్చేకాలం వస్తదేమో. మోదీ ఇంతగనం పెంచుతడు అనుకోలేదు. చాయ్వాలా పీఎం అయితే గరీబ్కు లాభమైతదని అనుకున్నం. కానీ అమీర్లకే ఫాయిదా అయ్యింది.
– శ్రీనివాస్ కొండపల్కల్వార్, హోటల్ వర్కర్ (కిన్వట్)
కేసీఆర్ అయితే బాగుంటది
తెలంగాణల కేసీఆర్ బాగా చేస్తున్నడని టీవీల్లో చూస్తున్నం. తెలంగాణ నుంచి అప్పుడప్పుడు వచ్చేవాళ్లు చెప్తుంటే వింటున్నం. మోదీ మస్తు ముచ్చట చెప్పుడేగని ఒక్క పని సక్కగ జేయలే. నేషనల్ పాలిటిక్స్లో కేసీఆర్ ఎంట్రీ ఇస్తే బాగుంటది. మోదీ ముందుగా సీఎం జేసినంకనే పీఎం అయ్యిండు కదా.. అట్లనే కేసీఆర్ సుత పీఎం అయ్యే చాన్స్ ఉంది. అయితే మోదీ లెక్క మాత్రం కేసీఆర్ చేయొద్దు.
– సునీల్ ఆడే, రేడియం స్టోర్
నిర్వాహకుడు (భోకర్)
మహారాష్ట్ర కోడలికి కేసీఆర్ మేనమామ
ఇల్లు కట్టి చూడు..పెండ్లి చేసిచూడు అంటారు. ఈ రెండూ జీవితంలో కష్టమైనవే. ఆర్థిక భారంతో కూడుకున్నవే. పేదరికంలో ఉన్న ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు తలకుమించిన భారమే. ఆ భారాన్ని తలకెత్తుకుంటూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో ఎంద రో పేదింటి ఆడపిల్లలకు మేనమామ అయ్యారు సీఎం కేసీఆర్. వారికి ఆర్థిక భరోసా ఇస్తూ అండగా ఉంటున్నారు. ఆ ఫలితాలేంటో మహారాష్ట్ర పర్యటనలో ‘నమస్తే తెలంగాణ’ బృందం కండ్లారా చూసింది. తెలంగాణ ప్రభు త్వ సాయం అందిన ఆ కుటుంబాలు సీఎం కేసీఆర్ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నది. మహారాష్ట్ర సరిహద్దు పట్టణం సిరొంచ బస్టాండ్ అది. హోరున కురుస్తున్న వానలో దీనంగా బస్సు కోసం ఎదురుచూస్తున్న రాజన్న, రాజక్క దంపతులను పలుకరించాం. తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి గురించి చెప్పుకొచ్చింది రాజక్క. ‘సిరొంచ మండలం తెకాడ మా ఊరు. కాళేశ్వరం పక్కన గ్రామానికి చెందిన యువతిని నా పెద్ద కొడుకుతో పెండ్లి చేసినం. అమ్మాయిది పేద కుటుంబం. పెండ్లికి కేసీఆర్ ఇచ్చిన కల్యాణలక్ష్మి డబ్బులు వాళ్ల తల్లిదండ్రులనే వాడుకోమన్నం. సర్కారు ఇచ్చిన పైసలు వాళ్లకు అక్కరకొచ్చినయి’ అని పేర్కొంది.
ఆ కష్టం నాకు తెలుసు
‘నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకు లు. తిప్పలుపడి ముగ్గురు బిడ్డల పెండ్లి చేసిన. 4 నెలల కింద పెద్ద కొడుక్కు పెండ్లి అయ్యింది. అమ్మాయి వాళ్లు పేదో ళ్లు. మొన్ననే తెలంగాణ సర్కారు ఇచ్చే కల్యాణలక్ష్మి డబ్బులు వచ్చినయ్. ఆ పైసలు మాకొద్దు మీరే వాడుకోండని మా వియ్యంకుడికి చెప్పిన. కేసీఆర్ సార్ మేనమామోలే పెండ్లి ఖర్చులకు ఇచ్చిన పైసలు మాకెందుకు. నేను ముగ్గురు బిడ్డల పెండ్లి చేసిన. ఆ తిప్పలేందో నాకు తెలుసు. మా సర్కారు ఇట్లాంటి సాయం చేయదు. – రాజక్క, తెకాడ గ్రామం,
సిరొంచ తాలూకా, గడ్చిరోలి జిల్లా