ఆదిలాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు లాభసాటిగా మారడంతో పాటు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి చేయూతనందిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. దీంతో పంటకోతకు జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. పత్తి సీజన్లో మూడు నెలల పాటు వారికి ఉపాధి లభిస్తున్నది. గ్రామాల్లోనే ఉంటూ రోజు రూ.700 వరకు కూలీ పొందుతున్నారు. ఏటా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది కూలీలు ఉపాధి కోసం వస్తుంటారు.
ఆశ్రయం కూడా ఇస్తున్నారు..
గతంలో జిల్లాలో వానకాలంలో 4 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసేవారు. ఈ ఏడాది జిల్లాలో 5.72 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నారు. జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. ఈ ఏడాది 4 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. ఏటా అక్టోబర్లో పత్తి సీజన్ ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుండటంతో జిల్లాలో పత్తి సీజన్లో కూలీల కొరత ఏర్పడుతున్నది. దీంతో రైతులు మహారాష్ట్ర నుంచి కూలీలను తీసుకొచ్చి గ్రామాల్లో నివాసం కల్పిస్తున్నారు. ఏటా 3 వేల మంది మహారాష్ట్ర కూలీలు జిల్లాకు వచ్చి వివిధ ప్రాంతాల్లో పత్తి చేలలో పనిచేస్తారు. వీరికి రైతులు కిలో పత్తి తీస్తే రూ.8 చెల్లిస్తారు. ఒక్కో కూలీకి రోజూ రూ.700 నుంచి రూ.800 వరకు వస్తుంటాయి. తమ రాష్ర్టాల్లో వ్యవసాయ పనులు చేస్తే రూ.300 నుంచి రూ.350 వరకు వస్తాయని, ఆదిలాబాద్లో అయితే రెండింతల పైసలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆరేండ్లుగా ఉపాధి..
ఏటా పత్తి సీజన్లో మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వస్తాం. మూడు నెలల పాటు పత్తి చేలల్లో పని చేస్తాం. కిలో పత్తి తీస్తే రూ.8 ఇస్తారు. ఆరేండ్లుగా ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నాం. మా రాష్ట్రంలో వ్యవసాయ పనులకు పోతే రూ.300 వరకు ఇస్తారు. ఇక్కడి రైతులు సీజన్కు ముందుగానే మమ్మల్ని పనికి రావాలని కోరుతుంటారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకుంటారు.
– నాందేవ్, ఉమర్ఖేడ్, నాందేడ్, మహారాష్ట్ర
మాకాడ రాష్ట్రంలో పనిదొరకట్లేదు..
మా రాష్ట్రంలో వ్యవసాయ పనులు దొరకట్లేదు. మా గ్రామం నుంచి మూడు కుటుంబాలకు చెందిన 15 మంది ఆదిలాబాద్కు వచ్చి పత్తి చేలల్లో పనిచేస్తున్నాం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పత్తి తీస్తాం. రోజుకు రూ.700 వరకు కూలీ గిట్టుబాటు అవుతది. తాంసి, తలమడుగు, జైనథ్ మండలాల్లో పత్తి తీస్తాం. పని ముగిసిన వెంటనే రైతులు డబ్బులు ఇస్తున్నారు.
– శోభ, ఉమర్ఖేడ్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర