హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి గాడి తప్పుతున్నది. పౌరులకు ఉపాధి కల్పించాల్సిన కేంద్రం ప్రైవేటు బాట పడుతున్నది. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్కు ఉన్నది. సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మా రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతున్నది’ అని మహారాష్ట్రకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాశ్జైన్ వెల్లడించారు. తెలంగాణ కంటే అనేక దశాబ్దాల ముందు ఏర్పడిన రాష్ర్టాలు చాలా వెనుకబడి ఉన్నాయని, 8 ఏండ్లలోనే చిన్న రాష్ట్రం తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదని విశ్లేషించారు. ఎన్నో దశాబ్దాలుగా, సాంస్కృతికపరంగా సన్నిహితంగా ఉన్న తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలనే ఆకాంక్ష మరాఠ్వాడాలో బలంగా వ్యక్తం అవుతున్నదని చెప్పారు. మోదీ సర్కార్ రైతులు, పేదల బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్నదని చ్పెరు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా విజయం సాధిస్తారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చేస్తున్న ప్రకటన, ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రకాశ్జైన్ విశ్లేషణ ఆయన మాటల్లోనే..
హైదరాబాద్ వస్తే విదేశాలకు వెళ్లిన అనుభూతి
మహారాష్ట్ర, తెలంగాణ ఇరుగుపొరుగు రాష్ర్టాలు. ఆ ఇంట్ల (తెలంగాణలో) ఏం కూర వండినా ఇక్కడికి (మహారాష్ట్ర) వాసన వస్తుంది. ఇక్కడేం తిన్నా అక్కడ తెలిసిపోతుంది. తెలంగాణ కోసం జరిగిన సుదీర్ఘ పోరాటానికి కేసీఆర్ నాయకత్వం వహించారు. రాష్ట్రం సాధించేదాకా కేసీఆర్ను అందరూ చిన్నగా చూశారు. ఇవ్వాళ రాష్ట్రం అనేక రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో అప్పటికీ ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. అనేక సార్లు హైదరాబాద్కు వచ్చిన. విదేశాలకు పోయినట్టు ఉంటది. విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, మెట్రోరైళ్లు, పెద్దపెద్ద ఐటీ కంపెనీలు ఇలా అనేక విషయాల్లో హైదరాబాద్ను చూస్తే కండ్లు జిగేల్మంటయి. పింఛన్లు, షాదీముబారక్, రైతుబంధు, సాగుకు ఉచిత కరెంట్.. ఇలా తెలంగాణ అన్ని రాష్ర్టాల కన్నా ముందున్నది. ప్రతి ఊర్లో హరియాలీ (హరితహారం) అద్భుతం. ఇవన్నీ చూసిన తరువాత మహారాష్ట్రలో అనేక గ్రామాల ప్రజలు తమకూ తెలంగాణలో అమలవుతున్న పథకాలు వస్తే బాగుండునని, అవసరమయితే తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
మరాఠ్వాడాకు కేసీఆర్ తెలుసు
మరాఠ్వాడాలో కేసీఆర్ను తెలంగాణ ఫైటర్ అని అంటుంటరు. గోదావరిపై ప్రాజెక్టు కట్టే విషయంలో అంతకుముందు ఆంధ్రా, మహారాష్ట్రల మధ్య గంభీర పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ వాటిని సామరస్యంగా పరిష్కరించారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాలని కేసీఆర్ ఆశిస్తున్నారు. మహారాష్ట్రలో శరద్పవార్, ఉద్ధవ్ఠాక్రేలతో కలిసి చర్చలు జరిపారు. బీహార్, ఢిల్లీ, పంజాబ్, జార్ఖండ్, కర్ణాటక రాష్ర్టాల్లో అందరినీ కలుస్తున్నారు. ఇవన్నీ టీవీల్లో, పత్రికల్లో మహారాష్ట్రలో ప్రముఖంగా వస్తున్నాయి. బీజేపీ హుకుంచాయ్ (బీజేపీ అరాచకాలు) పోవాలని.. ఎవరో ఒకరు ముందు నిలబడాలని, దానికి కేసీఆర్ లాంటి గట్టి నాయకుడు వస్తే దేశానికి మేలు జరుగుతుందని చర్చ నడుస్తున్నది. దేశంలోని అనేక పార్టీలను ఒప్పించి తెలంగాణ సాధించినట్టే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఎంతోమందిని ఆయన ఏకం చేయగలడన్న వార్తలు వస్తున్నాయి. బీజేపీని ఎదుర్కోవాలంటే భావసారూప్యత ఉన్నవారంతా కలువాలి. ఆ కలిపే పట్టుదల, నాయకత్వ పటిమ కేసీఆర్కు ఉన్నది.