గజ్వేల్, ఏప్రిల్ 11: దేశంలో కిసాన్ సర్కార్ రావాలని మహారాష్ట్ర రైతు ప్రతినిధులు ప్రదీప్ సాలుంఖే, నాయక్ షోలిద్ ఆకాంక్షించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మహారాష్ట్ర రైతు బృందం పర్యటించింది.
ముందుగా వర్గల్ మండలం సింగాయిపల్లి అటవీ ప్రాంతం, గ్రామంలో కంటి వెలుగు పథకం, గజ్వేల్లో సమీకృత(వెజ్, నాన్వెజ్) మార్కెట్, కోమటిబండ వద్ద మిషన్ భగీరథ సంపు, కుకునూర్పల్లిలో రైతువేదిక, కూడవెల్లి వాగు, మల్లన్నసాగర్ ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి తాగు, సాగు నీరందిస్తున్న గొప్ప మహానుభావుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నాలుగు గంటల పాటు సంక్షేమ పథకాల గురించి చెప్తుంటే.. అలా వినుకుంటూ కూర్చున్నామని, పథకాలను అమలు చేసే విధానం చాలా బాగుందని కితాబిచ్చారు.
దేశంలో గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్న రాష్ర్టాలు ఎన్నో ఉన్నాయని, వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా గోదావరి నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగు, సాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప ఆలోచన ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో రైతులను పట్టించుకునే నాయకుడే లేడని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు, మాంసం, పూలు, పండ్లు అమ్ముకునే విధంగా సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును సందర్శించిన రైతు బృందం సభ్యులకు ఈఎన్సీ హరిరామ్ ప్రాజెక్టు ప్రయోజనాలు, రైతులకు కలుగుతున్న ఉపయోగాలను తెలియజేశారు. అనంతరం బృంద సభ్యులు యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లి లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.