KCR | వేములవాడ : దేశంలో రైతు రాజ్యం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా తాలూకా చెందిన బాబురావు, శోభా మసే దంపతులు ప్రగతి భవన్కు పాదయాత్ర చేస్తున్నారు. గత కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ పాలనలో మనకు మిగిలినవి సంకెళ్లు మాత్రమేనని, వాటికి విముక్తి కలగాలని కోరుకుంటూ ఈ నెల 30న యాత్రను ప్రారంభించగా, 500 కిలోమీటర్లు నడిచి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్లో నాయకులు వారికి స్వాగతం పలికి అభినందించారు.
ఈ సందర్భంగా దంపతులు రాజన్న ఆలయంలో తలనీలాలు సమర్పించుకొని మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి అధికారమే లక్ష్యంగా, కేసీఆర్ ప్రధాని కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం సంపదనంతా విదేశాలకు తరలించగా, ప్రస్తుతం తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సైతం ప్రజల సొమ్మును ఆదాని, అంబానీలకు దోచిపెట్టిందని ఆరోపించారు. చివరకు రైతులకు బానిస సంకెళ్లు మాత్రమే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21న ప్రగతి భవన్కు చేరుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి తమ పాదయాత్రను ముగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులుడు పులం రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపుమాధవి, రూరల్ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, ఏఎంసీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు ఉన్నారు.