Telangana Cabinet | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మరో ఒకటి రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం జరుగనుంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరుగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటైన మహిళలకు రూ.2,500 ఆర్థికసాయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేషన్కార్డుల కోసం ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో.. ఈ అంశంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం విషయంలో గతంలో తాము చేసిన సిఫారసులను పునఃపరిశీలించాలని మంత్రివర్గం గవర్నర్ను కోరే అవకాశాలు ఉన్నాయి. 2008 డీఎస్సీ బాధితులకు న్యాయం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన డీఏపై ఓ ప్రకటన వచ్చే అవకాశమున్నట్టు చెప్తున్నారు.