మహబూబ్నగర్ : హైదరాబాద్కు సమానంగా మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాలులో లబ్ధిదారులకు అసెట్స్ పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను మంత్రి కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ కింద రూ.2కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. రూ.24లక్షల విలువైన రెండు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను అందజేశారు. వీటితో పాటు మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా దివ్యాంగులకు నాలుగు స్కూటీలు, ఆరు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. గతంలో అన్నిరకాలుగా నిర్లక్ష్యానికి గురైన మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందుందని, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పతకం పూర్తయితే మహబూబ్నగర్ నియోజకవర్గంలోని అన్ని భూములకు సాగునీరు అందుతుందని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు, ఉద్యోగులతో పాటు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ వెంటకరావు, ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్, పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కే సీతారామారావు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు మంత్రిని గజమాల, శాలువాలతో సత్కరించారు.