CM KCR | 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కేంద్రంలోని ప్రభుత్వ పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి.. నిర్లక్ష్యంగానే కొనసాగుతోందని, దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దిశగా చైతన్యమై, పార్టీలను కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకోవాల్సిన అవసరముందని కేసీఆర్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ ఫౌండర్లు, సిద్ధాంతకర్తలు, తాతలు తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేసే పరిస్థితులు చెల్లవని.. ఇప్పుడు దేశ ప్రజలకు పేర్లతో పనిలేదని, పని చేయగలిగిన వాళ్లతోనే పని (నామ్ దారీ నహీ కామ్ దారీ హోనా చాహియే) అని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుద్దసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సహా మరో 200 మంది కీలక రాజకీయ నేతలు ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రకృతి ప్రసాదించిన నీరు, వ్యవసాయ యోగ్యమైన భూమి, విద్యుత్కు అవసరమైన బొగ్గు నిల్వలు, వ్యవసాయానికి అవసరమైన సమతల శీతోష్టస్థితి సూర్యరశ్మి తదితర ప్రకృతి వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని వివరించారు. అన్ని ఉన్నా కూడా ఇంకా దేశ రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయమన్నారు. కేంద్రంలోని పాలకులకు లక్ష్యశుద్ధి లోపించడమే ఇందుకు కారణమన్నారు. దళితులు బహుజనులు సహా అన్ని వర్గాలు 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా చైతన్యం కావాలని సిఎం పిలుపునిచ్చారు. ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే ఆ పార్టీల పేర్లు.. నాయకుల పేర్లు మారుతాయి తప్పా.. కానీ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. పనివిధానంలో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే (నామ్ బదల్నేసే కుచ్ నహీ హోతా..కామ్ బదల్నా చాహియే) అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే గెలిచిన రెండేండ్లల్లో భారతదేశ ప్రజలకు రైతాంగానికి అవసరమైన విద్యుత్ను 24 గంటలు అందచేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, భారతదేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ అన్నారు. మన ఓటును పని చేయనివారికి కాకుండా మన కోసం పనిచేసుకునే వారికి వేసుకుంటేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ప్రస్తుతం తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపిన సీఎం కేసీఆర్.. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు తదితర పథకాలపై వివరించారు. తెలంగాణలో అమలవుతున్నప్పుడు మధ్యప్రదేశ్లో ఎందుకు అమలుకావని ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను కేంద్రాన్ని అడగాలని పిలుపునిచ్చారు. మన కష్టాలను ఇతరులు తీర్చరని.. మనమే తీర్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ దేశంలో ఏడు దశాబ్దాలు దాటినా ఆదివాసీలు, దళితులు బహుజనులు పీడితులుగానే కొనసాగాల్సిన దుస్థితి ఇంకెన్నాళ్లు అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే ఉత్తరభారతంలో కనీస జీవన విలువలు లేకుండా వివక్షకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం మార్పు కోరుకుంటున్నదని, ఈ దిశగా బుద్ధిజీవులు ఆలోచన చేయాలన్నారు. మేధావివర్గం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కలిసిరావాలన్నారు. ‘దిల్ వాలే దిమాఖ్ వాలే’ ఐక్యం కావాల్సిన అవసరమున్నదన్నారు.
తప్పుడు వాగ్ధానాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలవరించడంలో ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. త్వరలోనే మధ్యప్రదేశ్ భోపాల్లో బీఆర్ఎస్ పార్టీకి సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. మధ్యప్రదేశలోని అన్ని నియోజకవర్గాల్లో వాహనాలను ఏర్పాటు చేసుకుని పార్టీ భావజాలాన్ని ప్రచార సామగ్రిని గ్రామ గ్రామన తిప్పాలని ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో రైతు, దళిత, మహిళ, యువ, బీసీ తదితర తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు శంకరన్న దోంగ్డే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, మెట్టు శ్రీనివాస్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో జున్నార్ దేవ్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రాందాస్, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ మస్కోలతో పాటు దాదాపు 200 మంది సీనియర్ రాజకీయనాయకులు ప్రజా సంఘాల నేతలు మేధావులు తదితరులు బీఆర్ఎస్ తీర్థం స్వీకరించారు.