అమెరికాలో యంత్రాలతోనే పత్తి కోత: మంత్రి నిరంజన్రెడ్డి
టెన్నెస్సీ రాష్ట్రంలో పత్తి పంట సాగు, యంత్రాలు, విత్తనాల పరిశీలన
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి సాగులో యాంత్రీకరణ ఆవశ్యకమని, ఆ దిశగా రైతులు అడుగులు వేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. అమెరికాలో పత్తి సాగు మొత్తం యాంత్రీకరణతోనే ముడిపడి ఉన్నదన్నారు. విత్తనం నుంచి ఏరే వరకు అన్ని స్థాయిల్లో అక్కడి రైతులు యంత్రాలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు అమెరికా పర్యటలో ఉన్న మంత్రి గురువారం సింగిల్ పిక్ కాటన్ పంటను, విత్తన తయారీ కేంద్రాన్ని, జిన్నింగ్ మిల్ను సందర్శించారు. సింగిల్ పిక్ కాటన్లో ఒకేసారి దున్ని, విత్తనాలు విత్తడం, కలుపుమందు చల్లే, కోత యంత్రాలను పరిశీలించారు. ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్రెడ్డి, సీడ్స్ ఎండీ కేశవులుతో కలిసి టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్న రైతులు రిచర్డ్ కెల్లీ, బ్రాడ్ విలియమ్స్ పంటలను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమెరికాలో పెద్ద పెద్ద కమతాల కారణంగా యాంత్రీకరణ సులువవుతున్నదని, భారత్లో కమతాలకు అనుగుణంగా తగిన యంత్రాలు రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఆ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు వేగవంతం చేయాలని కోరారు. సగటున రోజుకు 70 టన్నుల పత్తి తీసే యంత్రాలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. అమెరికా యాంత్రిక వ్యవసాయం కారణంగా ఎకరాకు 30 వేల పత్తి మొకలు నాటుతున్నట్టు తెలిపారు. తద్వారా చీడపీడల బాధ తగ్గి అధిక దిగుబడి వస్తున్నదని, రైతులకు కూడా మంచి లాభాలు వస్తున్నట్టు వివరించారు.
మోటర్లకు మీటర్లపై కేంద్రం మొండివైఖరి వీడాలి
మోటర్లకు మీటర్లు బిగించాలనే ఆలోచనపై కేంద్ర ప్రభుత్వం తన మొండివైఖరి వీడి.. ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. అనవసర ప్రతిష్టకు పోకుండా భార త రైతాంగ ప్రయోజనాలు, ఇకట్లను దృష్టిలో పెట్టుకొని సవరణలు కాకుండా మొత్తం ప్రతిపాదిత చట్టా న్ని ఉపసంహరించుకోవాలని గురువారం ఒక ప్రకటన కోరారు. వ్యవసాయంపై సమగ్ర అవగాహన కలిగిన సీఎం కేసీఆర్ ముందుచూపుతో దేశంలో అందరికన్నా ముందే మోటర్లకు మీటర్ల బిగింపును వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. కనీసం రైతుల గొంతుకోసే నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. మోటర్లకు కరెంటు మీటర్ల బిగింపు, వరి ధాన్యం కొనుగోలులో కేసీఆర్ చేసిన సూచనలు కేంద్రం తలకెకలేదని విమర్శించారు. దేశంలో కరువొస్తే భారతదేశ ప్రజలకు అన్నం పెట్టే శక్తి ప్రపంచంలోని ఏ దేశానికీ లేదని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ కేంద్రం మాత్రం ఆ దిశగా ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. తెలంగాణ ధాన్యం కొనడానికి నిరాకరించి, రాష్ట్ర ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని చెప్పిన పీయూష్ గోయల్ ఇప్పుడు దేశంలో వరి సాగు పెంచాలని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ఓవైపు వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలను, రైతులను వేధిస్తూ ఇలాంటి ప్రకటన చేయడం కేంద్రానికి వ్యవసాయం పట్ల నిర్దిష్ట విధానం లేదని స్పష్టమవుతుందని విమర్శించారు.