హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుంచి అత్యుత్తమ క్యాడెట్లుగా ఎంపికైన సార్జెంట్ ఎం శ్రీశాంత్, క్యాడెట్ ఎన్ ధీరజ్ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి శనివారం గౌరవ ప్రదమైన లాఠీని అందుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపులో భాగంగా తెలంగాణ, ఏపీ రీజియన్ నుంచి వెళ్లిన క్యాడెట్లలో శ్రీశాంత్, ధీరజ్ అత్యుత్తమ క్యాడెట్లుగా ఎంపికయ్యారు. కారియాప పరేడ్ గ్రౌండ్లో శనివారం జరిగిన పీఎం ర్యాలీలో ప్రధాని మోదీ ఈ ఇద్దరిని ప్రత్యేకంగా అభినందించినట్టు డిఫెన్స్ విభాగం అధికారులు తెలిపారు.
అత్యంత గౌరవంగా మన క్యాడెట్లకు లాఠీ ప్రదానోత్సవం జరగడం చారిత్రాత్మకమని, గర్వకారణమని ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ తెలిపింది. లాఠీలతోపాటు ప్రధాని మోదీ అత్యుత్తమ క్యాడెట్లకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈసారి క్యాంపులో మన డైరెక్టరేట్ నుంచి వెళ్లిన క్యాడెట్లు విశేష ప్రతిభ కనబర్చారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీశాంత్, ధీరజ్లకు అభినందనలు తెలిపారు. వారి విజయం తోటి క్యాడెట్లకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన క్రమశిక్షణ వల్లే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు. రిపబ్లిక్ డే క్యాంప్లో భాగంగా దేశవ్యాప్తంగా 17 ఎస్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఎంపిక చేసిన తొమ్మిది మంది అత్యుత్తమ క్యాడెట్లలో తిరుపతి గ్రూప్ నుంచి జేడీ/జేడబ్ల్యూ ఆర్మీ విభాగంలో బెస్ట్ క్యాడెట్గా సార్జంట్ ఎం శ్రీశాంత్, సికింద్రాబాద్ గ్రూప్ నుంచి జేడీ/జేడబ్ల్యూ నేవీ విభాగంలో బెస్ట్ క్యాడెట్గా సీడీటీ నాగండ్ల ధీరజ్ ఎంపికయ్యారు.