హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)ను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. శనివారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇందులో హెచ్ఎండీఏ పరిధిలో 3.58 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు ఉన్నాయని వివరించారు.
వారు నాలుగేండ్లుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని, అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి వీటిని పరిషరించాలని సూచించారు. అక్రమాలకు తావులేకుండా, నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని స్పష్టంచేశారు. మధ్య దళారుల ప్రమేయం ఉండరాదని, సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలని అన్నారు. ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూశాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని, అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు తక్షణమే శిక్షణ నిర్వహించాలని స్పష్టం చేశారు.
క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసుల సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నందున, క్రమబద్ధీకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.