హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శనివారం బహిరంగ లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలంటూ గతంలో కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే ఆ విషయాన్ని మర్చిపోయారా? అని నిలదీశారు. ఎల్ఆర్ఎస్ కోసం ఇప్పటికే 25.44 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వెంటనే ఉచిత మార్గదర్శకాలు విడుదల చేయాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వంటి నేతలు ఊదరగొట్టారని పేర్కొన్నారు. ప్రజలపై ప్రేమ ఉందన్న రేవంత్రెడ్డి వారిపై ఇప్పుడు ఎందుకు భారం మోపుతున్నారని ప్రశ్నించారు. ప్రజలు సొంత సొమ్ముతో కొనుగోలు చేసిన భూములకు రెగ్యులరైజేషన్ పేరుతో ప్రభుత్వం వాటాలు తీసుకుంటున్నదని నాడు భట్టి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. ‘నో ఎల్ఆర్ఎస్-నో బీఆర్ఎస్’ అన్న ఉత్తమ్, ఎల్ఆర్ఎస్ రూపంలో ప్రజల రక్తమాంసాలను ప్రభుత్వం పీలుస్తున్నదన్న సీతక్క ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీశారు.
ఎల్ఆర్ఎస్ చార్జీల రూపంలో రేవంత్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై రూ. 20 వేల కోట్ల మేర భారం మోపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు ద్వంద్వనీతికి, పరిపాలనలతో, హామీల అమలులో డొల్లతనానికి ఇది అద్దం పడుతున్నదని దుయ్యబట్టారు. ఒక్కో కుటుంబంపై రూ.లక్ష చొప్పున భారం వేస్తున్నది ప్రజాప్రభుత్వం ఎలా అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన తప్పుడు హామీలకు రేవంత్రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ఆ లేఖలో డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిత్యం గుర్తుచేస్తూ ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్పై నిరసనలు చేపట్టామని తెలిపారు.
– సీఎం రేవంత్రెడ్డి
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
– ఉత్తమ్ కుమార్రెడ్డి
– సీతక్క