హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య బంగాళాఖాతం నుంచి నైరుతి దిశవైపునకు వంపు తిరిగి ఉన్నదని, వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయవ్యదిశగా కదలొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నట్టు వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని పేర్కొన్నది. వీటన్నింటి ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరిక జారీచేసింది. గురువారం పలు జిల్లాల్లో అతిభారీ, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని హెచ్చరించింది.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలోని పుట్రేలో అత్యధికంగా 9.6 సెంటీమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా పోతవరంలో 8.4 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణశాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాల రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, నిర్మల్, వికారాబాద్, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేటలో 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండలో 8.95 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా చింతకానిలో 8.85 సెంటీమీటర్లు, బోనకల్ మండలం రావినూతలలో 8.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.