హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు వర్షాలు (Rains) కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ( Meteorological Center) హైదరాబాద్ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగామ, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు అధికారులు ఎల్లో (Yellow), గ్రీన్ (Green) అలర్ట్ను జారీ చేశారు. బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసింది. జనగామ, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్-మల్కాజిగిరి, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసాయి.
వరంగల్లో 49.3 మి.మి, మహబూబాబాద్లో 32.3 మి.మి, నల్లగొండలో 30.8 మి.మి వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల వర్షం కురిసింది. ఏపీకి కూడా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.