కొద్ది రోజులలో మొదలు కానున్న ‘హరితహారం’, కరోనా సమస్య దృష్ట్యా ఈ సారి మరింత ముఖ్యమవుతున్నది. చెట్లు పెంచకపోవటం, ఉన్నవాటి నరికివేత సహా పర్యావరణ విధ్వంసం, ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగం వల్ల తీవ్రమైన నష్టాలు జరుగుతున్నాయని, కరోనా వంటివి అందులో భాగమేనని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. కరోనాకు తక్షణ కారణం చైనా అయినా, ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఇటువంటి వైరస్లన్నీ పర్యావరణ వినాశనం వల్ల వెలికివచ్చినవేనన్నది వారి నిర్ధారణ.
పోతన, కాళోజీ, దాశరథి వంటి ధిక్కరణ కవులను గౌరవించిన మహా మేధావి, బహుభాషావేత్త పీవీ ధిక్కరణ కవుల్లో అగ్రగణ్యుడు మహాకవి శ్రీశ్రీ భౌతికంగా అస్తమించి ఇవాళటికి (జూన్ 15, 1983) 38 ఏండ్లు. మన కాళోజీ ‘నా గొడవ’ప్రథమ ప్రచురణను 1953లో సారస్వత పరిషత్తు అలంపురం సభల్లో
కరోనా ప్రమాదం ఎటువంటిదో మొత్తం ప్రపంచంతో పాటు తెలంగాణ ప్రజలకు స్వయంగా అనుభవానికి వచ్చింది. వ్యాధి రావటం నుంచి మరణాల వరకు ఆ అనుభవాలు ఎటువంటివో ఎవరో చెప్పనక్కరలేదు. సమస్య ఇప్పటికీ తీరలేదు. రాష్ట్రంలో ఈ ఆదివారం నుంచి లాక్డౌన్ ఎత్తివేసినా సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అందరూ ‘హరితహారం’ ప్రాముఖ్యాన్ని గుర్తించి వ్యవహరించటం చాలా అవసరం. రాష్ట్రం 2014లో ఏర్పడగా, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో తెలియదు గాని మరుసటి సంవత్సరం నుంచే పెద్ద ఎత్తున ‘హరితహారం’ కార్యక్రమాన్ని ఆరంభించి ఇప్పటివరకు పట్టుదలగా కొనసాగిస్తున్నారు. ఇది తప్పకుండా విశేషమే. ఎందుకంటే, అంతకుముందు ‘వన మహోత్సవ’ కార్యక్రమం ప్రతి ఏటా ఒకరోజు మొక్కుబడిగా చేసి తర్వాత మరిచిపోయే వారు. కేసీఆర్ అందుకుభిన్నంగా దానిని ఎంతటిస్థాయిలో ఎంత విస్తృతంగా జరుపుతూ వస్తున్నారో తెలిసిందే.
ముఖ్యమంత్రి మొదట వర్షాలు కురియటానికి, క్షీణిస్తున్న అడవులను సంరక్షించి ఇంకా పెంచటానికి, ఆరోగ్య పరిరక్షణకు, కోతులు ఊళ్లమీద పడటం గాక ‘వాపస్’ పోయేందుకు అడవులు అవసరమని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇందుకు కరోనా వంటి వైరస్ సమస్యలు తోడవుతున్నాయి. ‘హరితహారం’ ఆరంభమైనప్పుడు మొదటి రెండు మూడు సంవత్సరాలు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు కూడా ఎక్కువ శ్రద్ధ చూపలేదు. ప్రతిపక్షాలు, సోకాల్డ్ విద్యావంతుల సంగతి సరేసరి. అయినప్పటికీ, పర్యావరణ ప్రాముఖ్యాన్ని మొదటే గుర్తించిన కేసీఆర్ దార్శనికత, పట్టుదల వల్ల రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం నాలుగు శాతం పెరిగి జాతీయ సగటును మించిపోయింది. పలు అవార్డులు సాధించింది. రాజధాని హైదరాబాద్కైతే మొన్నటి సీజన్లో ‘గ్రీనెస్ట్ సిటీ ఆఫ్ ద కంట్రీ’ గుర్తింపు లభించింది.
ఇదంతా చెప్పటం ఎందుకంటే ఈ కరోనా అనుభవాలతో ఇపుడందరూ ‘హరితహారం’ ప్రాముఖ్యాన్ని గతం కన్న ఎక్కువగా, అనేక రెట్లు ఎక్కువగా గుర్తించాలి. కేసీఆర్ ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ కరోనా వంటి వైరస్లకు పర్యావరణ పరిరక్షణలు, విధ్వంసాలతో గల సంబంధాన్ని ప్రస్తావించారు. అధ్యయనం ఒక అలవాటుగా మొదటినుంచీ ఉన్న ఆయనకు, కరోనా తదితర వైరస్లకు పర్యావరణంతో గల సంబంధం గురించి శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాలు దృష్టికి వచ్చే ఉంటాయి. లేనట్లయితే, అందరూ దోషులను వెతకటం, నిందించటం వంటి పరిమితులలో ఉండిపోగా ఆయన ఇట్లా సమస్యకు మూలాలను వెతకటమనే విస్తృతమైన, లోతైన దృష్టిని తీసుకొని ఉండేవారు కాదని భావించవచ్చు. అయితే, ‘హరితహారం’ గురించి ఆయన మొదటినుంచి పదేపదే గుర్తుచేస్తున్న మాట ‘ప్రజల భాగస్వామ్యం’. అధికార యంత్రాంగాన్ని తను నయానో భయానో క్రమంగా దారికి తెస్తున్నారు. ముఖ్యంగా నిరుడు గ్రామాలకు అనేకం సమకూర్చటం, స్థానిక యంత్రాంగాన్ని, ప్రజా ప్రతినిధులను బాధ్యులను చేయటంతో ఫలితాలు గణనీయంగా పెరిగాయి. ఇది ఈ రచయిత స్వయంగా అనేక గ్రామాలు తిరిగి గమనించిన విషయం. అటువంటప్పుడు సాధారణ ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉందన్నది ప్రశ్న. ఇది మొదటి కన్న కొంత మెరుగుపడినా, ఇంకా పెరగవలసి ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో, కనీసం కరోనా అనుభవం వల్ల నైనా పట్టణ ప్రజలకు అటువంటి స్పృహ కలుగుతుందని ఆశించాలి. పట్టణ ప్రాంత అటవీ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, వార్డు అసోసియేషన్లు, యువజన క్లబ్బులు, ఈ విధమైన ఇతర సంస్థలు ఉమ్మడిగా చేయవలసిన పని ఇది.
ఈ కరోనా వైరస్ చైనా నుంచి వ్యాపించిందన్నది కనిపిస్తున్న విషయమే. అది గబ్బిలాలు, ఇతర జంతువులు, మాంసం మార్కెట్లు, మనుషులు అనే క్రమంలో సహజంగా వ్యాపించిందా, లేక వూహాన్ లేబరేటరీ నుంచి ప్రమాదవశాత్తు లీక్ అయిందా అనే ప్రశ్నపై ఎవరి వాదనలు వారు చేస్తున్నా ఇంతవరకు నిర్ధారణగా ఏదీ తెలియదు. దానిపై ఏదో ఒకరోజు స్పష్టత రాగలదని ఆశించాలి. అందుకోసం దర్యాప్తు సాగవలసిందే.
దానినట్లుంచి ఒక మౌలిక విషయాన్ని అర్థం చేసుకోవటం అవసరం. ప్రకృతిలో లెక్కకు కూడా తెలియని వైరస్లు లక్షల్లో ఉన్నాయి. మనుషులు వాటిని తమ మానాన తమను వదలకుండా జోక్యాలు చేసుకుంటే, ‘నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా’ అనే అంటాయి. ఇంతకు ముందు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఎబోలా, మశూచి, ప్లేగు, హెచ్ఐవి, స్పానిష్ ఫ్లూ వంటివి డజన్ల కొద్దీ వైరస్లు ప్రకృతి నుంచి బయటపడి మొత్తం కొన్ని కోట్ల మంది ప్రాణాలు తీశాయి. మానవుడుతన జీవనం కోసం ప్రకృతిలో ఎంతో కొంత జోక్యం చేసుకోక తప్పదు. అదే విధంగా కొన్నిసార్లు వైరస్లు ప్రకృతిపరమైన కారణాల వల్ల సహజంగా బయటపడవచ్చు. కాని ఇపుడు శాస్త్రవేత్తలు చెప్తున్నదానిని బట్టి, పెద్దపెద్ద కంపెనీలు సూపర్ లాభాల కోసం ప్రజలను వినియోగతత్వానికి అలవాటు చేస్తూ పర్యావరణ మూలాలకు వెళ్ళి కొత్త టెక్నాలజీలతో, దురాశతో ఎన్నడూ లేనంత ధ్వంసం చేస్తున్నాయి. సమస్య వెనుకగల మూలం ఇది. ప్రజలు చైతన్యవంతులై ప్రకృతిని కాపాడుకోనిదే ఇందుకు పరిష్కారం లేదు.
టంకశాల అశోక్