‘దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద మొత్తం ముస్లింలకు పంచుతుంది.. మహిళల మంగళసూత్రాలనూ వదలరు, ముస్లింలకే పంచేస్తారు..’ రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ఇది. ఇక మన రాష్ర్టానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన స్థాయిని కూడా మరిచిపోయి ‘మానవ బాంబులమవుతాం, పేగులు మెడలో వేసుకుంటా, ఉరికించి కొడతా’ అంటూ ప్రసంగిస్తున్నారు. దేశంలో అనేక రాష్ర్టాల్లో రాజకీయపార్టీల ప్రసంగాలు ఈ స్థాయిలోనే ఉన్నాయి. ఎన్నికలు, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు అసహ్యించుకునే స్థాయిలో నాయకుల మాటలు సాగుతున్నాయి.
హైదరాబాద్ మహా నగరంలో పాతబస్తీలో కేవలం మత ప్రాతిపదికనే ఎన్నికల ప్రచారం సాగుతుంది. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతం పేరుతోనే ప్రచారం సాగిస్తుంటాయి. ఒక పార్టీ అభ్యర్థి మరో పార్టీ మతానికి చెందిన ప్రార్థనాలయంపైకి బాణం ఎక్కుపెట్టి కొట్టినట్టు నటిస్తే దానికి బోలెడు ప్రచారం. ఇలాంటి కవ్వింపు చర్యలు ఆయా మతాల వారి అభిమానాన్ని సంపాదించవచ్చు, మతం ఓట్లు సంపాదించవచ్చు కానీ, ఆ ప్రచారం సమాజంపై చూపే దుష్ప్రభావం వీరికి అవసరం లేదు. రెచ్చగొడితే ఓట్లు వస్తాయి, విజయం సాధిస్తే చాలు సమాజంపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది వీరికి అవసరం లేదు.
బేగంబజార్లో హోల్సేల్లో గతంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కిలోకు రూ.20 అని తెలిసి ఆశ్చర్యం వేసింది. అప్పుడు అల్లం కిలో వంద రూపాయలు. రూ.100కు కిలో అల్లం ఉంటే దాన్ని పేస్ట్ చేసి రూ.20కి కిలో ఎలా అమ్ముతారు? వ్యాపారుల్లో మరీ ఇంత సేవాభావమా? అని ఆశ్చర్యం వేసి వివరాలు తెలుసుకుంటే, సేవాభావం కాదు, మన్ను కాదు. ఫక్తు లాభాపేక్ష. ఆంధ్రా నుంచి ప్రతి రోజు పెద్ద ఎత్తున నగరానికి అరటి పళ్లు తీసుకువస్తారు. వాటితో పాటు అరటి బోదెలు ఉచితంగా లభిస్తాయి. అరటి బోదెలు, ఆలుగడ్డ పేస్ట్ చేసి, వాసన కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి అమ్ముతారు.
అలా చేయడం అన్యాయం, పాపం కదా? అంటే వారికి కావలసింది వ్యాపారంలో కేవలం లాభమే కానీ, పాపపుణ్యాలు కాదు. ఈ కల్తీ సరుకు తిని ప్రజలు అనారోగ్యాలపాలైనా వారికి అవసరం లేదు. కనికరం ఉండదు, పాపభీతి ఉండదు. సరిగ్గా రాజకీయ వ్యాపారాలు సైతం అంతే. కావలసింది రాజకీయ వ్యాపారంలో లాభమే తప్ప సమాజానికి కలిగే లాభనష్టాల గురించి వారికి పెద్దగా ఆలోచన ఉండదు. రాజకీయపక్షాలు, రాజకీయ నాయకులు రాజకీయాన్ని కేవలం వ్యాపారంగానే చూస్తున్నారు. ప్రజలు సైతం ఇది మనకు సంబంధం లేని వ్యాపారం అన్నట్టుగా వదిలివేశారు. గల్లీ లీడర్లు ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వేరు, ప్రధాని స్థాయి వ్యక్తి అలా మాట్లాడితే కిందివారు వారినే అనుసరిస్తారు.
బండి సంజయ్తో పోటీ పడి నరేంద్ర మోదీ మాట్లాడితే ఏం చేయగలం. దేశ సంపదను అంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలున్నవారికి పంచుతారు, మీ మహిళల మంగళసూత్రాలను కూడా వదలరు, ముస్లింలకు పంచుతారని మోదీ ప్రసంగించారు. ఓట్ల కోసం, ప్రజల మధ్య మతపరమైన విభజన కోసం ఎంతకైనా తెగిస్తామన్నట్టుగా ఉన్నది మోదీ ప్రసంగం. ఎంఐఎం ఇలా ప్రసంగించడం లేదా? అని కొందరు ప్రశ్నిస్తారు. పాత నగరానికే పరిమితమైన ఎంఐఎం ఎన్నికల సభలు, పార్టీ సభలు అర్ధరాత్రుళ్లు జరుగుతాయి. వాళ్లు ఏం మాట్లాడుతారో మీడియాలో కవరేజీ ఉండదు. ఎంఐఎం చేసిన ప్రసంగాలను ప్రస్తావించవచ్చు. పాత నగరంలో ఒక మతానికి పరిమితమైన రాజకీయపక్షంతో దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి మోదీని ఒకేగాటన కట్టి చూడలేం. ఏ వ్యూహం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందుతామనే లెక్కలే ముఖ్యం కానీ ప్రజల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే సమాజానికి కలిగే నష్టం ఏమిటి అనేది వారికి అనవసరం. మతాల మధ్య ఉద్రిక్తతలు ఎంత పెరిగితే వారికి అంత లాభం.
‘కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట’ అనే సామెత చెప్పినట్టు ప్రధాని రెచ్చగొట్టే ప్రసంగాలను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తమ పార్టీ వారి అనైతిక చర్యలను, రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రశ్నించలేక పోతున్నారు, అడ్డుకోలేకపోతున్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలో చేరి పోటీ చేయడాన్ని రాహుల్గాంధీ తీవ్రంగా విమర్శించారు. తమ పార్టీ తరపున అలా పోటీ చేస్తున్న వారి గురించి రాహుల్గాంధీకి తెలియదా?
మైనారిటీలు మొదటినుంచి కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా ఉన్నారు. కాంగ్రెస్ ఐదారు దశాబ్దాల పాటు దేశంలో అధికారంలో ఉన్నది. అంటే మైనారిటీ ఓటు బ్యాంకు ఆ పార్టీకి బాగా ఉపయోగపడింది. కర్ణాటక, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సైతం మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చిందనేది నిజం. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చిన మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయమే, గత పదేండ్ల నుంచి కాంగ్రెస్ను అధికారానికి దూరం చేసింది. దశాబ్దాల పాటు మైనారిటీ ఓటుబ్యాంకు రాజకీయాల ద్వారా అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్, ఇప్పుడు మైనారిటీ ఓటుబ్యాంకు రాజకీయాల సైడ్ఎఫెక్ట్తో అధికారానికి దూరమైంది.
ఈసారి అధికారంలోకి, సంకీర్ణంలో భాగంగానైనా వస్తుందా? అనే విషయమై స్పష్టమైన సూచనలూ లేవు. అలాంటిది ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, మంగళ సూత్రాలతో సహా మైనారిటీలకు కాంగ్రెస్ పంచుతుంది’ అని ప్రధాని స్థాయి వ్యక్తి అనడం దురదృష్టకరం. అందరి ఆస్తులు ముస్లింలకు ఇవ్వడం సాధ్యమా? కాంగ్రెస్ ఇప్పుడు పుట్టిన పార్టీ కాదు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు కేంద్రంలో పాలించిన పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు మంగళసూత్రాలతో సహా అందరివీ తీసుకొని ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిందా? అలా ఇవ్వడం సాధ్యమా?
దేశంలో పదేండ్ల పాలనలో ఇది చేశాం, మళ్లీ అధికారం ఇస్తే వచ్చే ఐదేండ్లు ఇది చేస్తాం అని చెప్పి ఓట్లడిగితే పెద్దగా ప్రయోజనం ఉండదనుకుంటున్నారు. అందుకే మతపరమైన చీలిక ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని మోదీ బృందం కోరుకుంటున్నది. దీనివల్ల నష్టపోయేది మాత్రం సమాజమే. సమాజ వాతావరణాన్ని ఎంత కలుషితం చేస్తున్నారో వారికి తెలియడం లేదు. గుజరాత్ ఉద్రిక్తతల పుణ్యమాని సీఎం సీటుకు ఢోకా లేకుండా చేసుకోవడమే కాకుండా ప్రధానమంత్రి స్థాయి వరకు వెళ్లారు. అందుకే అదే విజయ సూత్రాన్ని పదే పదే నమ్ముకుంటున్నారు.
‘కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట’ అనే సామెత చెప్పినట్టు ప్రధాని రెచ్చగొట్టే ప్రసంగాలను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తమ పార్టీ వారి అనైతిక చర్యలను, రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రశ్నించలేక పోతున్నారు, అడ్డుకోలేకపోతున్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలో చేరి పోటీ చేయడాన్ని రాహుల్గాంధీ తీవ్రంగా విమర్శించారు. తమ పార్టీ తరపున అలా పోటీ చేస్తున్న వారి గురించి రాహుల్గాంధీకి తెలియదా? చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎంపీగా గెలిచి, పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయకుండా ఇప్పుడు అదే చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరపున రంజిత్రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఇక దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నీతులు చెప్పడానికే… ఆచరిస్తే ఆ మాత్రం బలమైన అభ్యర్థులు కూడా దొరకరనుకొని రాహుల్గాంధీ వీరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారేమో. అల్లం పేరుతో అరటి బోదె గుజ్జును అమ్మే వ్యాపారికి, తమ ప్రసంగాలతో సమాజాన్ని కలుషితంగా మార్చి రాజకీయ ప్రయోజనం పొందే రాజకీయ నాయకులకు పెద్దగా తేడా లేదు. స్వచ్ఛ భారత్ అంటూ రోడ్లపై చెత్తా చెదారాన్ని ఏరి పారేయడాన్ని ఒక ఉద్యమంలా ప్రారంభించిన ప్రధాని మోదీ తన రాజకీయ ప్రసంగాల్లో అంతకుమించిన ప్రమాదకరమైన చెత్త పోగుపడుతున్నదనే విషయాన్ని గ్రహించాలి.
– బుద్దా మురళి