ఒరిజినల్ కాషాయ రంగు లోగోలోకి దూరదర్శన్ రావడం ప్రారంభం మాత్రమే. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిచి, నరేంద్ర మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి కనుక వస్తే.. ప్రసారభారతి, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ)లో భారీగా మార్పులు చేయాలని యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు న్యూస్ 18కి తెలిపాయి.
15 దేశాల్లో బ్యూరోలను అనుసంధానించడం ద్వారా దూరదర్శన్ను గ్లోబల్ బ్రాండ్గా అభివృద్ధి చేయడం, ప్రసారభారతికి చెందిన శబ్ద్ పోర్టల్ పరిధిలోకి విదేశీ అవుట్లెట్లతో సహా 1000కి పైగా మీడియా సంస్థలను తీసుకొచ్చి దాన్ని గ్లోబల్ న్యూస్ ఏజెన్సీగా అభివృద్ధి చేయడం, ఎంఐబీలో ఇంటెలిజెన్స్ హబ్ ఏర్పాటు, సాధారణ పౌరుల కోసం భారత్ నమన్ పోర్టల్ను ప్రారంభించడం లాంటివి ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్లను వివిధ ప్రాంతాలకు విస్తరించడం ద్వారా గ్లోబల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను ప్రకటించి, ఫేక్ న్యూస్లను అడ్డుకోవాలని భావిస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ)లో మాస్టర్ కోర్సును ప్రవేశపెట్టనుంది.
ఇవన్నీ ప్రధాని మోదీ ఆదేశాల మేరకు మోదీ 3.0 కోసం మంత్రిత్వ శాఖలు రూపొందిస్తున్న పంచవర్ష, 100 రోజుల ప్రణాళికల్లో భాగమే. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని దూరదర్శన్ తన నీలి రంగు లోగోను కాషాయ రంగులోకి మార్చడం వివాదాస్పదంగా మారింది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షం అభివర్ణిస్తుంది.1982లో ఇందిరాగాంధీ ఎంపిక చేసిన ఒరిజినల్ రంగు ఇదేనని, దాన్నే తాము మళ్లీ పునరుద్ధరించామని బీజేపీ తెలిపింది.
భారతీయ సినిమాలు, ప్రసారాల విదేశీ గుర్తింపును వివరించడం, భారతీయ సాఫ్ట్ పవర్ను బలోపేతం చేయడం లాంటివి ప్రసార భారతి ప్రణాళిక అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా డీడీ ఇండియా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ)లను గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చదిద్దనున్నారు. డీడీ ఫ్రీ డిష్ను పొరుగు దేశాలకు విస్తరించాలని, దాని కింద చానళ్ల సంఖ్యను పెంచాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నది. విదేశీ అవుట్లెట్లతో సహా 1000కి పైగా మీడియా సంస్థలను అనుసంధానించడం ద్వారా ఇటీవల ప్రారంభించిన శబ్ద్ పోర్టల్ను భారత గ్లోబల్ న్యూస్ ఏజెన్సీగా అభివృద్ధి చేయనున్నారు.వీడియో, ఆడియో, టెక్స్, ఫొటో, ఇతర రూపాల్లో రోజువారీ న్యూస్ ఫీడ్ను వినియోగదారులైన మీడియా సంస్థలకు అందించడానికి ఆడియో-విజువల్ నెట్వర్క్ శబ్ద్ రూపొందించబడింది. దేశవ్యాప్తంగా కల ప్రసారభారతి నెట్వర్క్కు చెందిన రిపోర్టర్లు, కరస్పాండెంట్లు, స్ట్రింగర్లు అందించే ఫీడ్ ఆధారంగా ఇది పని చేస్తుంది.
ఐఐఎంసీలో మాస్టర్ కోర్సును ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే ఈ రంగంలో నియంత్రణ చట్టం రూపొందించడానికిబ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లును కూడా క్యాబినెట్ ముందుకు తీసుకురావచ్చు. బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఐజ్వాల్లో 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ను ప్రారంభించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నది.
జన్ సంవాద్, భారత్ నమన్ అనేవి మోదీ 3.0 కోసం మరో రెండు భారీ ప్రాజెక్టులని సంబంధిత వర్గాలు తెలిపాయి. రియల్టైమ్ ట్రాన్స్లేషన్, డబ్బింగ్, సబ్టైటిలింగ్, ఏఐ ఆధారిత కంటెంట్ జనరేషన్ కోసం ఎంఐబీలో ఏఐ హబ్ ఉంటుంది.ప్రజల ఉచిత వినియోగానికి ఉచిత కంటెంట్ నేషనల్ వీడియో గేట్వేల ఏర్పాటును కలిగి ఉంటుంది.
భారత్ నమన్ను జాతీయ భాండాగారంగా (నేషనల్ ఆర్కైవల్),మీడియా యాక్సెస్ కోసం పౌరుల ప్లాట్ఫామ్గా అభివృద్ధి చేస్తారు. దేశంలోని అన్ని భాషల్లో ఉండే పుస్తకాలు, ప్రసిద్ధ డాక్యుమెంట్లు, ఫొటోలు ఇక్కడ అందుబాటులోకి తెస్తారు. వాణిజ్య అవసరాల కోసం చిత్ర నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు వాడుకునే అవకాశం ఇవ్వడం ద్వారా ఆదాయం ఆర్జించే ప్రయత్నాలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు న్యూస్ 18కు తెలిపాయి.
దేశ ప్రధాని కూడా భారత పౌరుడే. భారత పౌరులకు, భారత చట్టాలకు ఆయన అతీతుడేమీ కాదు.చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఆయనపై కూడా చర్యలు చేపట్టాలి. ప్రధానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ఏమిటి?
– బృందాకారత్, సీపీఐ(ఎం) నాయకురాలు
– అమన్ శర్మ