Srisailam | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం తొలి సోమవారం పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ర్టాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునుండి క్యూలైన్లలో బారులుదీరారు. తెల్లవారుజుమున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని పసుపు కుంకుమలతో సారె సమర్పించి, కార్తీక దీప దానాలు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. స్వామివారికి సామూహిక అభిషేకాలు, గర్భాలయాభిషేకాలను మాసాంతం తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చనలు, చండీహోమం, రుద్రయాగం, నిత్యకళ్యాణం భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రత్యేకంగా ఓం నమ: శివాయ ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని కర్ణాటక ఆంధ్ర భజన బృందాలచే చతుస్సప్తాహ భజనలు నిరంతరం జరుగుతున్నాయి. ఆలయ ఉత్తర మాఢవీధితోపాటు గంగాధర మండపం వద్ద మహిళలు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించుకున్నారు. ఆలయ దర్శనాలు ప్రారంభమై ముగిసేంత వరకు ఉచిత ప్రసాద వితరణ మరియు క్యూలైన్లలో దర్శనానికి వేచిఉండే భక్తులకు పాలు, మంచీనీరు, బిస్కెట్లు, అల్పాహరపొట్లాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.