హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసమే రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టిన యూనిట్-1 ఆలస్యానికి కారణాలు ఏమిటని లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేతకాని, మాలోత్ కవిత, జీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు. 800 మెగావాట్ల యూనిట్-1 ట్రయల్ రన్ 2020లో నిర్వహించాల్సి ఉండగా, ఆలస్యానికి కారణమేంటి? విద్యుత్తు ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ సమాధానమిస్తూ.. కొవిడ్ ప్రభావం, ఎన్జీటీ కొత్త పర్యావరణ నిబంధనలు, ఇసుక లభ్యత లేకపో వటం బీహెచ్ఈఎల్ ఈ యూనిట్పనులను నెమ్మదిగా చేయడం వల్ల ఆలస్యమైందని చెప్పారు. ప్రస్తుతానికి మొదటి యూనిట్ పనులు పూర్తయ్యాయని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
మెట్రో రెండో దశ ఖర్చు తెలంగాణదే
హైదరాబాద్లో రెండోదశ మెట్రో రైలు మార్గం మైండ్స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్లు తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి స్పష్టం చేశారు. మెట్రో రైల్ రెండో దశ నిర్మాణంపై ఎంపీ జీ రంజిత్రెడ్డి ప్రశ్నించగా, కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. 32 కిలోమీటర్ల మెట్రో రైల్ మార్గానికి రూ.6,105 కోట్లు అవుతుందని అంచనా వేయగా, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరి స్తున్నదని తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26 కి.మీ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ 5 కిలోమీటర్లు 50ః50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ర్టాలు భరిస్తాయని, రూ.8,453 కోట్లుగా నిర్ణయించినట్టు వెల్లడించారు.