Harish Rao | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలనే కాకుండా రాహుల్గాంధీ, సోనియాగాంధీని సైతం మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గుజరాత్ మాడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటుంటే, అదే కావాలని రేవంత్ అంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ మళ్లీ ప్రధాని కావడం పక్కా అని రేవంత్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తున్నదని, దీనిని బట్టి కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని చెప్పకనే చెప్పేశారని పేర్కొన్నారు. రాహుల్గాంధీ, సోనియాగాంధీ ఆశీస్సులు కంటే మోదీ ఆశీస్సుల కోసమే రేవంత్ ఎక్కువగా తాపత్రయపడుతున్నారని చెప్పా రు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ హరీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికలు రేవంత్రెడ్డి రెఫరెండం అనడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇచ్చిన హామీల్లో అనేకం అమలు చేయలేదని, చేస్తున్న వాటికి షరతులు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి తన వంద రోజుల పాలనలో వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ బీజేపీకి లవ్లెటర్ రాశారని విమర్శించారు. సీఎం కార్యాలయానికి వెళ్లే విలేకరుల పెన్నులు, ఫోన్లు గుంజుకుంటున్నారని, ఇదెక్కడి నిరంకుశత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్లెట్లా అడుగుతరు?
రైతులకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ఏ ఒక్కటీ అమలు చేయలేదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. డిసెంబరు 9న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదని, వరికి బోనస్, ఉచితంగా 24 గంటల విద్యుత్తు, రైతు భరోసా ఏదీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఒక్క హామీ కూడా అమలు చేయనందుకు కాంగ్రెస్కు రైతులు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. త్వరలోనే యాసంగి పంట రాబోతున్నదని, ఇప్పటికైనా రూ. 500 బోనస్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో కరువు వచ్చిందని పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేక మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దానిని అమలు చేయలేదని విమర్శించారు. డిసెంబరు నుంచే రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, రాష్ట్రంలోని 44 లక్షలమంది పింఛనదారులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలపై బాండ్ పేపర్లు ఇచ్చినందుకు ఎవరిపై కేసులు పెట్టాలని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 పథకం ఏమైందని నిలదీసిన హరీశ్రావు.. వారిని మహాలక్ష్ములను చేస్తామని మాటతప్పినందుకు మీకు ఓటు వేయాలా? ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని చెప్పి ఇప్పుడు ఫీజు వసూలు చేస్తున్నందుకు ఓటువేయాలా? అని ప్రశ్నించారు. ఆటోడ్రైవర్లు చనిపోతున్నా పట్టించుకోనందుకు, నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పినందుకు, దళితబంధు రద్దుచేసినందుకు, కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని మోసం చేసినందుకు ఓట్లు వేయాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రాపకం కోసం ఎవరు ప్రయాసపడుతున్నారో ప్రధాని పర్యటనతోనే అర్థమైందని హరీశ్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలను బీజేపీ తీసుకుందని, అలాంటి బీజేపీతో తామెందుకు కలిసి వెళ్తామని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మురళీధర్రావు, మాధవీలత రేవంత్రెడ్డిని మెచ్చుకుంటున్నారని చెప్పారు. ప్రజాదర్బార్తో హడావుడి చేసిన రేవంత్రెడ్డి ఒక్కరోజు మాత్రమే వెళ్లి వదిలేశారని మండిపడ్డారు.
30 వేల ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారు?
తాము 30 వేల ఉద్యోగాలు భర్తీచేశామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నదని, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఎలా భర్తీ చేశారని హరీశ్రావు నిలదీశారు. అవన్నీ బీఆర్ఎస్ ఇచ్చినవేనని, రేవంత్రెడ్డి నియామకపత్రాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. తాము 1.6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న రేవంత్రెడ్డి 11 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయాయని నిలదీశారు. డీఎస్సీకి ఫీజు తీసుకోబోమని చెప్పి ఇప్పుడు ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
మూడు నెలలుగా జీతాల్లేవు
ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న 22 వేల మందికి మూడు నెలలుగా వేతనాలు లేవని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఒక నెల పింఛన్ ఎగురగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం ఉద్దేశించిన సీఎంఆర్ఎఫ్ను ఆపారని, 60 వేలకు పైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. పోలవరం కట్టింది కేంద్రమేనని, వరదల్లో దాని డయాఫ్రంవాల్, కాఫర్డ్యాం కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. ఐదేండ్లు అయినా పోలవరంపై ఎన్డీఎస్ఏ నివేదిక రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రెండు రోజుల్లోనే రిపోర్ట్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
30 లక్షల మందికే ఉచిత విద్యుత్తు
రాష్ట్రంలో 90 లక్షల రేషన్కార్డులు ఉంటే 30 లక్షల మందికి మాత్రమే ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని, 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాలంటూ పథకాన్ని తూట్లు పొడిచారని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పని మొదలుపెట్టవచ్చని, దానికి ప్రధాని అనుమతి అవసరం లేదన్నారు. కేసీఆర్కు ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేడని చెప్పడం రేవంత్రెడ్డి స్థాయికి తగదని హితవు పలికారు. మూడు నెలల్లో రూ. 16 వేల కోట్ల అప్పులు తెచ్చారని, మరిన్ని అప్పుల కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్రావు పేర్కొన్నారు.